జగిత్యాల, మార్చి 26, (నమస్తే తెలంగాణ)/జగిత్యాల రూరల్: ‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శించడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం తప్ప ఆయనకు ఏది చేతకాదు’ అని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ లీడర్లకు షుగర్ ఫ్యాక్టరీ అంశం ఎన్నికల స్టంట్గా మారిందని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనడం ఆశ్చర్యంగా ఉందని.. అయినా ఫ్యాక్టరీ పాత డోర్లు తెరవడం తప్ప వారు చేసేదేంలేదని ఎద్దేవా చేశారు.
నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని చూస్తున్న మాజీ మంత్రి, పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాటలు ప్రజల చెవిలో పూలు పెట్టేలా ఉన్నాయని విమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణవాణి బలంగా వినిపించాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలన్న బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువాల్సిందేనని చెప్పారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని పౌలస్తేశ్వరాలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని బీఎల్ఎన్, దేవీశ్రీ గార్డెన్స్ల్లో జరిగిన జగిత్యాల రూరల్, అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. సాయంత్రం రూబీ ఫంక్షన్ హాల్లో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందుల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగురేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతానని స్పష్టంచేశారు. నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలు అర్వింద్ను ఎంపీని చేసింది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తప్పా, కేసీఆర్, కేటీఆర్, కవితలను తిట్టడానికి కాదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసని, వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి జువ్వాడి రత్నాకర్రావు చైర్మన్గా, షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ విషయంలో కమిటీ వేశారని, అందులో ఆయన సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు.
అప్పుడు జీవన్రెడ్డితోపాటు తాను ఎమ్మెల్యేగా సభ్యుడిగా ఉన్నానని, ఆ కమిటీ ప్రభుత్వ యాజమాన్యంలో ఫ్యాక్టరీ నడపలేమని, ప్రైవేట్ అధీనంలోనే నిర్వహించాలని నివేదిక ఇచ్చిందని, అన్నీ తెలిసిన జీవన్రెడ్డి ఇప్పుడు మళ్లీ కొత్తగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోసపూరిత మాటలు చెప్పే నాయకులపై నాయకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీగా ఉండి ప్రశ్నించే గొంతుక అని చెప్పి జీవన్రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. జీవన్రెడ్డి నిజామాబాద్కు సైతం పట్టభధ్రుల నియోజకవర్గ ప్రతినిదేనని, ఆయన ఎన్నిసార్లు నిజామాబాద్కు వచ్చారని ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని మాట్లాడుతున్నారని, మరి రుణమాఫీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో జగిత్యాల పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీశ్, బాల ముకుందం, రాయికల్ ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీసీ సభ్యుడు మహేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ రాధ రవీందర్ రెడ్డి, దశరథ రెడ్డి, శీలం ప్రియాంక ప్రవీణ్, యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కత్రోజ్ గిరి, మహిళ అధ్యక్షురాలు కచ్చు లత పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల దర్మార్గమైన పాలనకు బుద్ధి చెప్పాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మూడు నెలల్లోనే ఎంతటి తేడా వచ్చిందో గుర్తించాలి. కరెంట్ లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, రుణమాఫీ, రైతుబంధు, పెన్షన్ల పెంపు లేదు. ఇదేం ప్రభుత్వం? రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, రేవంత్రెడ్డి వ్యవహారం సరిగా లేదు. ప్రజలను హామీలతో మోసం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకున్నా, చిన్నచిన్న సమస్యలతో దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్కు సంస్కారం లేదు. అలాంటి వ్యక్తికి మరో అవకాశం ఇవ్వద్దు. బీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష ఓట్లు పడేలా శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి.
– కే విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం మంత్రులు, ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తుంది. అదే పద్ధతిలో మంత్రులను, సీఎం రేవంత్రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని అడిగా. అంతే తప్ప పార్టీ మారే ఉద్దేశం అస్సలు లేదు. నేను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే పనిచేస్తా. కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా వెన్నంటి నిలబడుతా. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించి తీరుతా. కాళేశ్వరం ప్రాజెక్ట్లో మూడు పిల్లర్లు రిపేర్ చేయకపోవడం వల్లే ఇప్పుడు సాగునీటికి, తాగునీటికి గోస వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఎండే ప్రతి పంట చేనుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పి, తెలంగాణ ఆత్మగౌరవ సాధన కోసం ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడు కావాలి.
– డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
గులాబీ సైనికులకు ఎప్పుడు అధికార యావ లేదు. వారిది ఎల్లవేళలా అభివృద్ధి బాటమాత్రమే. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇప్పటికీ రైతన్నలకు రైతుబంధు రాలేదు. పంటలకు సాగునీరు ఇవ్వలేని దైన్య పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. పంటలు నష్టపోయి రైతులు వీధిన పడే పరిస్థితి తలెత్తింది. వృద్ధులకు పెన్షన్ డబ్బులు పెంచడం కాదు కదా..? ఉన్న పెన్షన్ సైతం వేయడం లేదు. ఇలాంటి పరిస్థితులకు కారణమైన కాంగ్రెస్కు ప్రజలు బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్