హుజూరాబాద్, జనవరి 5 : చాలా గ్రామాల్లో ఏళ్ల క్రితం కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. నాలుగు చినుకులు పడితే జలజలా నీళ్లు జారుతుండడంతో కార్యాలయాల్లో కూర్చొనే పరిస్థితి లేదు. చాలా గ్రామ పంచాయతీ కార్యాలయాలు రేపోమాపో కూలేందుకు సిద్ధంగా ఉండడంతో సర్కారు కొత్త భవనాలు నిర్మించేందుకు నడుం బిగించింది. సకల సదుపాయాలతో నూతన గ్రామ సచివాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడంపై ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సకల సౌలతులతో నిర్మాణం
శిథిలావస్థలో ఉన్న భవనాల్లో సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇన్నాళ్లూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా నిర్మించే గ్రామ సచివాలయాలు సకల సౌలతులతో నిర్మాణం చేపట్టనున్నారు. కాట్రపల్లి, రాంపూర్, రంగాపూర్, జూపాక, పోతిరెడ్డిపేట గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థలో ఉండ గా, బొత్తలపల్లి ఇటీవలే నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. వీటన్నింటికీ త్వ రలో కొత్త భవనాల కల సాకారం కానుంది. ఈజీఎస్ ద్వారా నూతన జీపీ భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా, ఈ మేరకు ఆయా గ్రామాల పంచాయతీల తీర్మానం మేరకు నిర్మాణపనులు జరుగనున్నాయి.
6 కొత్త భవనాలు
గ్రామాల పాలనకు కేంద్ర బిందువైన పంచాయతీలకు త్వరలోనే కొత్త భవనాల కల సాకారం కానుంది. దశాబ్దాలుగా ఇరుకు గదులు.. అరకొర వసతుల మధ్య కొనసాగుతున్న జీపీల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. మండలంలో 19 గ్రామపంచాయతీలు ఉండగా అందులో పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఆరు గ్రామపంచాయతీలకు నూతన భవనాలు నిర్మించనున్నారు. విశేషమేమిటంటే రంగాపూర్ గ్రామపంచాయతీ భవనం కూలిపోయే దశలో ఉండగా ప్రస్తుతం అద్దె ఇంట్లో కొనసాగుతున్నది. కాట్రపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చి వేయగా అద్దె ఇంట్లో ప్రస్తుతం కొనసాగుతోంది.
దశాబ్దాల కల
గ్రామాల పంచాయతీలకు నూతన భవనం నిర్మాణం చేయాలన్న గ్రామస్తుల దశాబ్దాల కల నెరవేరనుంది. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. నూతన భవన నిర్మాణం అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
– కాసగోని నిరోష, సర్పంచ్(కాట్రపల్లి)
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ క్రమంలో పంచాయతీ నూతన భవనాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడుతాం.
– ఇరుమళ్ల రాణీ, ఎంపీపీ