విద్యారంగానికి సర్కారు ప్రాధాన్యం
అనుబంధాల మధ్య పిల్లల్ని చదివించండి
మంత్రి కేటీఆర్ సూచనతో బడి అభివృద్ధికి నిర్ణయం
ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు హరిణి కృషి అభినందనీయం
రాష్ట్ర ఏర్పాటుతో అన్ని రంగాల్లో అభివృద్ది
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
వీర్నపల్లి, జూన్ 30: ‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కార్పొరేట్ విద్య మోజులో పడి అప్పుల పాలు కావద్దని సూచించారు. అనుబంధాలు, ఆప్యాయతల మధ్య పిల్లలను చదివించాలని ఉద్బోధించారు. గురువారం ఆయన మండలకేంద్రంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 కోట్లతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని గర్జనపల్లిలో 40 లక్షలతో నిర్మించనున్న గోదాం, 25 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్ల పనులకు భూమిపూజ చేశారు. మద్దిమల్లలో 4.60లక్షలతో ముదిరాజ్ కుల సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సూచన మేరకు తమ బిడ్డ ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ హరిణి 5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలు, సకల హంగులతో స్కూల్ను నిర్మించడం సంతోషకరమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిలో ఎందరో సర్కారు బడుల్లోనే చదువుకున్నవారేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులు స్కూటర్పై వచ్చి పిల్లలను సర్కారు బడిలో దింపిపోయే వాతావరణం కల్పించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధితో పాటు తగిన సిబ్బంది, టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఈవో రాధాకిషన్కు సూచించారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, మరికొన్ని చోట్ల విద్యార్థులు ఎక్కువగా ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రేషనలైజ్ చేసే అంశాన్ని పరిశీలించాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడమనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదని వెల్లడించారు. రాయినీ, హన్మాయి చెరువులు నింపేందుకు గ్రావిటీ కెనాల్ పనులు పూర్తయ్యాయని, భూ సేకరణ పూర్తి చేసి త్వరలోనే రెండు చెరువులను నింపుతామని ప్రకటించారు.
సరైన రోడ్డులేక మోటర్ సైకిల్పై వెళ్లిన..
2014లో సంసద్ ఆదర్శ యోజన కింద మారుమూల గిరిజన పల్లె అయిన వీర్నపల్లిని మంత్రి కేటీఆర్ సూచన మేరకు దత్తత తీసుకున్నానని వినోద్ చెప్పారు. అమాయక గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకే ముందుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఆనాడు నక్సల్స్ పేరిట అమాయకులు పోలీసు కాల్పుల్లో చనిపోగా, మరోవైపు పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగాల్లో చేరిన ఎందరో నక్సల్స్ తుపాకీ గుళ్లకు బలైపోయారని చెప్పారు. వీర్నపల్లిలోని ఎనిమిది తండాలను పరిశీలించేందుకు కారులో వెళ్లేందుకు రోడ్డు లేక మోటార్సైకిల్పై వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ తండాల్లో అందమైన తారు, సీసీ రోడ్లు, మిరుమిట్లు గొలిపే కరెంట్ వెలుగులు, ఆహ్లదకరమైన చెట్లు కనిపిస్తున్నాయన్నారు. గిరిజనులు పోడు భూముల్లో పండ్ల తోటలను పెంచితే బాగుంటుందని సూచించారు. మద్దిమల్లలోని పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో హైబ్రిడ్ సీతాఫలాల మొక్కలను చూసి ముదిరాజ్ కులస్తులను అభినందించారు.
వీర్నపల్లితో విడదీయరాని అనుబంధం
వీర్నపల్లితో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నది. పెద్దనాన్న వినోద్కుమార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని దేశవ్యాప్త గుర్తింపు తెచ్చారు. మంత్రి కేటీఆర్, పెద్దనాన్న సూచనతో ఈ ఊరిలో 5కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మిస్తు న్నాం. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి చూపెడు తున్నాం. ఆరోగ్యం మీ ముంగిట్లో అనే నినాదంతో గ్రామాల్లో మొబైల్ వైద్య సేవలను అందిస్తున్నాం. అలాగే వీర్నపల్లి మండలానికి అంబులెన్స్ను కొనుగోలు చేసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.
-హరిణి, ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్