కలెక్టరేట్, అక్టోబర్ 31: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు సహకరించాలని అధికారులకు, సిబ్బందికి నూతన కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇక్కడికి కలెక్టర్గా సోమవారం సాయంత్రం బదిలీ చేయగా, మంగళవారం ఉదయం కరీంనగర్కు చేరుకున్నారు. ఆ వెంటనే విధుల్లో చేరారు. ఆ తర్వాత అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో ఒడిదొడుకులు సర్వసాధారణమని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే చేస్తున్న ఉద్యోగానికి సరైన న్యాయం చేసినవారమవుతామని అన్నారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ సమిష్టి కృషితో పనిచేద్దామని చెప్పారు. అంతకుముందు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్కు వచ్చిన కలెక్టర్కు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, పలువురు జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కలెక్టర్తో కలిసి అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ తదితరులు కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లా అధికారుల సంఘం నాయకులు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. స్వాగత కార్యక్రమంలో ఆర్డీవో కే మహేశ్వర్, డీపీవో కొమురయ్య, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్, డీఆర్డీవో ఎల్ శ్రీలత, డీటీవో డీడీయూ నాగరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.