చొప్పదండి, ఏప్రిల్ 27 : జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 29న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. చొప్పదండి మండల కేంద్రంలోని విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరో తరగతిలో 80 సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7730 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
వీరి కోసం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముల్కనూర్లో ఒకటి, చొప్పదండిలో 2, హుస్నాబాద్లో 2, హుజూరాబాద్లో 3, జగిత్యాలలో 6, మల్యాలలో 1, కాటారంలో1, మంథనిలో 1, పెద్దపల్లిలో 3, సుల్తానాబాద్లో 2, కరీంనగర్లో 7, మెట్పల్లిలో 3, సిరిసిల్లలో 4, వేములవాడలో ఒక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్ వెంట తీసుకురావాలని, దీంతోపాటు ఆధార్ లేక రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని చెప్పారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు తమ వెంట ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని, బ్లాక్ లేదా బ్లూ బాల్పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని, పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండడం వల్ల జవాబులను ఓఎంఆర్ ఆన్సర్షీట్లోనే నింపాలని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఢిల్లీలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని, విద్యార్థులు సూచనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాలని చెప్పారు.