కోల్సిటీ, అక్టోబర్ 5: ‘విజయదశమినాడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయం భారతావనికి శుభసూచకం..ఆయన నాయకత్వంలో దేశ ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయపథమే..మోదీ ఆరాచక పాలనకు చరమగీతం తప్పదు’ అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. బుధవారం కొప్పుల దంపతులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి గోదావరిఖనిలోని జయదుర్గాదేవి ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించాలని వేడుకున్నామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో అష్టకష్టాల పాలైన దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజున కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధించి కొత్త చరిత్రను సృష్టించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.