పెద్దపల్లి, మే 9(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ‘పల్లె దవాఖాన’ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యదర్శి విషాల్ చౌహాన్ ప్రకటించారు. జాతీయ హెల్త్ మిషన్ 7రకాల వైద్య సేవల విభాగంలో అవార్డులను ప్రకటించగా ‘నాణ్యత వైద్య సేవలు’ విభాగంలో 100మార్కులకు గాను తెలంగాణ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామ పల్లె దవాఖానకు 87శాతం మార్కులు లభించగా, ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు 75శాతం మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది.
అయితే ప్రథమ స్థానంలో నిలిచిన ధన్వాడ సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా జిల్లాల పునర్విభజన తర్వాత పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నా జయశంకర్ భూపాల్లి జిల్లా పరిధిలోకి వెళ్లింది. గత నెల 26వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ల బృందం సభ్యులు డాక్టర్ శేషు, ఉల్లాస్జ్యోతి సుల్తాన్పూర్ పల్లెదవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మందులు పరీక్షల నాణ్యత తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని విభాగాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్టాండర్స్ను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు. పల్లె దవాఖానకు జాతీయ అవార్డు రావడంపై కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ప్రమోద్కుమార్ ఎలిగేడు మండల వైద్యాధికారి శ్రీకృష్ణ, పల్లె దవాఖాన వైద్యులు డా. వినయను ప్రత్యేకంగా అభినందించారు.