కొండాపూర్ : కొండాపూర్ ( Kondapur ) రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన ఫుట్ పాత్ ( Footpath ) ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిరు వ్యాపార దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు నిరసన ( Victims Protests ) వ్యక్తం చేశారు.
పేదల జీవనాధారమైన దుకాణాలను కూల్చొద్దంటూ పలువురు మహిళలు, కాలనీ వాసులతో పాటు ఉపాధి కోల్పోతున్న బాధితులు జేసీబీ ( JCB Bulldozers ) యంత్రానికి అడ్డంగా పడుకుని అధికారులను వేడుకున్నారు. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఉన్నపళంగా బతుకుదెరువును లాక్కుంటే తమ పిల్లలను ఎలా పోషించాలి? తాము బతికేదెట్ల అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు న్యాయం చేయాలని, కూల్చివేతలకు ముందు తగిన నోటీసులు ఇచ్చి, చట్టబద్ధమైన విధానాలను పాటించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.