సిరిసిల్ల టౌన్, మార్చి 23: మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) నుంచి ఎన్క్వాస్ సర్టిఫికెట్ను సాధించింది. రాష్ట్రంలోని నాలుగు దవాఖానలు ఎన్క్వాస్ సర్టిఫికెట్ పొందగా ఆ జాబితాలో పీఎస్ నగర్ పీహెచ్సీ ఒకటి. ఈ సర్టిఫికెట్తో దవాఖానలో ఏటా వైద్య సేవల మెరుగు కోసం రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకోనుంది. పీఎస్నగర్ పీహెచ్సీకి గురువారం ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడంపై కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.
గత నెలలో జాతీయ బృందం పర్యటన
కాగా జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు గత ఫిబ్రవరిలో సుందరయ్యనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. దవాఖానలో మౌలిక వసతులు, వైద్య సేవలు, రోగులతో వైద్యులు వ్యవహరిస్తున్న విధానంతో పాటు శానిటేషన్, గర్భిణులకు చికిత్స తీరు, వారు పాటించాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ఇస్తున్న సలహాలు, సూచనలు, దవాఖన ఆవరణలో పచ్చదనం పెంపునకు ఇస్తున్న ప్రాధాన్యం, ఓపీ వివరాలు, వైద్యుల హాజరు పట్టిక, తదితర రికార్డులను పరిశీలించారు. అదే విధంగా జాతీయ కార్యక్రమాలు క్షయ, కుష్టు, మలేరియా, హెచ్ఐవీ నిర్మూలనకు చేస్తున్న కృషిని తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో ఎన్క్వాస్ సర్టిఫికెట్ ఎంపిక కోసం కనీసం 75 శాతం మార్కులు సాధించాల్సి ఉండగా, సుందరయ్యనగర్ పీహెచ్సీ 86.6శాతం మార్కులతో అర్హత సాధించింది.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్వాస్) సర్టిఫికెట్ గుర్తింపు రావడం హర్షనీయం. జిల్లా ప్రజలకు పీహెచ్సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు నిదర్శనం. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి. ఓపీ, ఐపీ, సర్జికల్.. ఇలా అన్ని విభాగాలలో నాణ్యత పెరిగింది.
– అనురాగ్ జయంతి, కలెక్టర్