గంభీరావుపేట, ఏప్రిల్ 7 : స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది మొక్కల పెంపకం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంప్యార్డు నిర్మాణంతో సాధించిన ప్రగతి పురోగతికిగాను కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి ఎంపిక చేసింది.
గంభీరావుపేట గ్రామం, మండల కేంద్రం 1962లో మేజర్ గ్రామపంచాయతీగా ఏర్పడింది. గత సమైక్య పాలనలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడింది. ప్రజలకు కావల్సిన ఏ ఒక్క మౌలిక వసతి లేక నరకం చూసింది. ప్రస్తుతం గ్రామంలో 33,400 జనాభా ఉండగా, స్వరాష్ట్రంలో గ్రామానికి మహర్దశ పట్టింది. మంత్రి కేటీఆర్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. కోట్లాది నిధులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. మెరుగైన స్వయం సంవృద్ధి వసతులు సమకూర్చుకుంది.
సర్పంచ్ కటకం శ్రీధర్ కృషితో ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని 16 వార్డుల్లో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ శుద్ధమైన జలం సరఫరా అందుతున్నది. హరితహారంలో భాగంగా వేలాది మొక్కలతో పచ్చదనం పరుచుకున్నది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు కూడా నిర్మించారు. ఇంకా పంట పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్లు సైతం వేశారు. షాపింగ్ క్లాంప్లెక్స్తో గ్రామపంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతున్నది. పారిశుధ్యం, పరిశుభ్రతలో భాగంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు.
సమష్టి సహకారంతోనే పురస్కారం..
మేజర్ గ్రామపంచాయతీకి జాతీయ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. పాలక వర్గం, అధికారులు, గ్రామస్తుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం చొరవ, మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామంలో దశల వారీగా అనేక మౌళిక వసతులు కల్పించుకున్నాం. లెక్కకు మించిన అభివృద్ధి పనులూ పూర్తి చేసుకున్నాం. జాతీయ అవార్డు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం.
– కటకం శ్రీధర్, సర్పంచ్, గంభీరావుపేట