కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 23: నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న 186.5ఎకరాల పట్టా భూమికి మాత్రమే పరిహారం అందించారని, మరో 180.06ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదని వాపోయారు.
అటు పరిహారం అందక, ఇటు పంటలు సాగు చేసుకునేందుకు భూమి లేకపోవడంతో తమకు ఉపాధి కరువైందని ఆవేదన చెందారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు హామీ ఇస్తే నమ్మి ఎమ్మెల్యేను గెలిపిస్తే.. రెండున్నరేళ్లు దాటినా కూడా తమకు అన్యాయమే ఎదురవుతుందన్నారు. చెరువులో భూములు పోవడంతో ఉపాధి కోల్పోవడంతో ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక, కుటుంబాల పోషణ కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి నష్ట పరిహారం అందించాలని కోరారు.