Municipal | కోరుట్ల, మే 9: పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్ఫిన్ బేకరీలో మున్సిపల్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, మెస్ లో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం, ఆహర పదార్థాలు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రతమైన వాతావరణంలో తినుబండారాలు విక్రయిస్తున్న షాపు యజమానులకు రూ.18 వేల జరిమానా విధించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడినచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారులు షాపుల నుంచి వెలువడిన తడి, పొడి, హానికారక చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, బాలె అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్, మున్సిపల్ సిబ్బంది హేమంత్, రాజు, రమేష్ పాల్గొన్నారు.