korutla | కోరుట్ల, ఏప్రిల్ 17: పట్టణంలోని తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు గురువారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బీఎస్ లత ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, మెస్సులు, రెస్టారెంట్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణదారులు విక్రయిస్తున్న నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రత మైన వాతావరణంలో తినుబండారాలు విక్రయిస్తున్న షాపు యజమానులకు రూ.12 వేల జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడినచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
బట్ట, జనపనార, కాగితపు సంచులు, వినియోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు షాపుల నుంచి వెలువడిన తడి, పొడి, హానికారక చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు మహేష్, జగదీష్, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు పాల్గొన్నారు.