Kondagattu | జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు భర్త ముజ్బుర్ రహమాన్ (ఏలూరు పెద్ద బాబు) దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముజ్బుర్ రహమాన్ అంజన్న స్వామి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆలయ ముఖ్య అర్చకుడు చింటు స్వామి వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముస్లిం మతస్తుడిగా కొండగట్టు అంజన్న స్వామివారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి సందర్భాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని భక్తులు అభిప్రాయపడ్డారు. కొండగట్టు క్షేత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోందని పేర్కొన్నారు.