Godavarikhani | కోల్ సిటీ, జూన్ 8 : రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తి సోమవారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తి ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదు. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈరోజు తప్పక చేపల కూరతో తినాలని పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. గోదావరిఖనిలో సోమవారం తెల్లవారు జామున నుంచే మృగశిర సందడి కనిపించింది. నగరంలోని ప్రధాన చేపల మార్కెట్ తో పాటు రోడ్ల పక్కన చేపల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి.
ఎల్లంపల్లి జలాశయం, గోదావరి నది, చుట్టు ప్రక్కల గ్రామాల చెరువుల నుంచి పెద్ద సంఖ్యలో చేపలను తీసుకవచ్చి రోడ్ల ప్రక్కన కుప్పలుగా పోసి విక్రయించారు. మృగశిర ప్రభావంతో సాధారణ రోజుల కంటే అధిక ధరలకు విక్రయించారు. ఐనప్పటికీ చేపలు కొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో ఇంటింటా పచ్చి చేపల పులుసు వంటకాలు ఘుమ ఘుమలాడాయి. అలాగే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బత్తిని వంశస్థులు చేప మందు పంపిణీ చేయగా, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు చేప మందు ప్రసాదం తీసుకున్నారు.