రామడుగు (చొప్పదండి) ఏప్రిల్ 8 : ఆరు గ్యారెంటీల అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మాయచేసి మభ్యపెట్టిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గ్యారెంటీలను అమ లు చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి శివారులోని వసుధ గార్డెన్లో సోమవారం చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విద్యార్థి యువజన చైతన్య సదస్సు నిర్వహించారు.
కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమా ర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గెల్లు శ్రీనివాస్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేళ్లు ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మించుకొని కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. పదేళ్లలో 1.61 లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలకు గత పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు మొదలయ్యాయని మండిపడ్డారు. రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. బండి సంజయ్లో ఐదేళ్లలో చేసిందేమీ లేదని, ఐదు రూపాయలు కూడా తేలేదని ధ్వజమెత్తారు. ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాలేదని విమర్శించారు.
వినోద్కుమార్ 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు రైల్వేలైన్, కరీంనగర్ చుట్టుపకల నాలుగు జాతీయ రహదారులు, రూ.వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తెచ్చారని గుర్తుచేశారు. కరీంనగర్లో ట్రిపుల్ఐటీకి యాభై ఎకరాల స్థలం కేటాయిస్తే సంజయ్ పట్టించుకోక పోవడంతో కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించిందన్నారు. ఆయన ఏ అర్హతతో ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు వినిపించాలంటే వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేసిన అబద్ధపు ప్రచారాలతో అప్పుడు మోసపోయినం. ఇప్పుడు మళ్లీ మోసపోవద్దు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సాకులు చెబుతున్నది. యాసంగి సీజన్లో ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ వెంటనే ఇవ్వాలి. బండి సంజయ్ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదు. ఒక నవోదయ పాఠశాల తేలేదు. ఒక గుడికి కూడా నయాపైసా నిధులు తేలేదు. నేను 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాతే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకువచ్చిన. కరీంనగర్ను స్మార్ట్సిటీ జాబితాలో చేర్పించి రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశాం. మరోసారి నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుత.
– బోయినపల్లి వినోద్కుమార్, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు వినబడాలంటే బోయినపల్లి వినోద్కుమార్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలి. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు కొత్తలు కూడా తేలే. కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేయడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వినోద్ కుమార్నే గెలిపించండి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే