కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 12: ‘ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. అభివృద్ధి విషయంలో ఇంకెన్నాళ్లీ అసత్య ప్రచారం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి’ అని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు. తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం నిధులు 154 కోట్లతో చేపడుతున్నామని చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. ఈ పనుల్లో కేంద్రానిది నయా పైసా లేదని తేల్చి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రాష్ర్టాలకు ఇచ్చే సెస్ను కేంద్రం నేరుగా కాకుండా సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఇస్తున్నదని, ఆ నిధులు రైల్వే ఓవర్ బ్రిడ్జికి మళ్లించి పనులు చేపడుతుండడం దుర్మార్గమని విమర్శించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 28కోట్లు ఉన్నాయని, దీనిపై బండికి కనీస అవగాహన లేకుండా, ఏం తెలుసుకోకుండానే ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడడం అవివేకమన్నారు. తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ కావాలని అప్పటి ఎంపీ వినోద్కుమార్ 2014 నుంచి 2019 వరకు అనేక సార్లు రైల్వే అధికారులకు విన్నవించారని గుర్తుచేశారు. అయితే ఈ రూట్లో పాపులేషన్ లేదని బ్రిడ్జి మంజూరు చేయలేమని అప్పటి దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారని గుర్తు చేశారు.
అయితే కార్పొరేషన్లో ఉంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరవుతుందన్న ఒక్క కారణంతోనే తీగలగుట్టపల్లిని నగరంలో విలీనం చేసుకొని బ్రిడ్జిని సాధించుకున్నామని చెప్పారు. కేంద్రం నేరుగా రైల్వే నిధుల నుంచి ఈ బ్రిడ్జిని నిర్మిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులను ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉండేదన్నారు. నిధులు తేవడం చేతకాని బండి సంజయ్ ఇప్పుడు కేంద్రమే పూర్తి నిధులు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆయన ఎంపీగా చేసిందేమీ లేదని, ఎన్నికలు వస్తున్నాయని డ్రామాలు ఆడుతున్నాడని, చేయని పనులను కూడా చేశానని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో, నగరంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని, ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, ఐలేందర్, నాయకులు పవన్, శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.