అధ్వానంగా అంతర్గత రోడ్లు.. రోడ్లపై పారే మురుగుకాలువలు.. చెత్తాచెదారంతో కంపుకొట్టే వీధులు.. చుక్కనీటి కోసం బారులు.. శిథిలావస్థలో పాత ఇండ్లు, భవనాలు.. ఎప్పుడు కూలుతాయో తెల్వని స్తంభాలు.. వేలాడే విద్యుత్తీగలు.. రాత్రి పూట వెలగని విద్యుద్దీపాలు.. ఇది నాటి పాలనలో పల్లెల దుస్థితి.
అద్దాల్లా మెరిసే రోడ్లు.. ఆగకుండా పారే డ్రైనేజీలు.. చెత్త సేకరణకు వాహనాలు.. శుభ్రంగా వీధులు.. ఇంటింటికీ తాగునీటి నల్లాలు.. కొత్త స్తంభాలు.. రాత్రి వెలుగు విరజిమ్మే ఎల్ఈడీ బల్బులు.. ఇది నేటి పాలనలో పల్లెల ప్రగతి.
పల్లె సరికొత్తగా వెలుగుతున్నది. స్వరాష్ట్రంలో ప్రతి ఊరూ కాంతులీనుతున్నది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ తెచ్చిన ‘పల్లె ప్రగతి’ యజ్ఞంలా సాగి, గ్రామాల రూపురేఖల్ని మార్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా నిధుల వరద పారగా, గడిచిన తొమ్మిదేళ్లలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్రాలీ, హరితహారం కోసం ట్యాంకర్, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంప్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో శోభాయమానంగా విలసిల్లుతున్నాయి. దశాబ్దాల సమస్యలన్నీ దూరం చేసుకొని అద్దంలా మెరిసిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఎన్నో గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి, ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఉమ్మడి జిల్లా పరిధిలో 63 మండలాలు, 1215 గ్రామ పంచాయితీలున్నాయి. నాడు ఈ గ్రామాలకు ఏడాదికి మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరయ్యేవి. ఆ నిధులతోనే జీపీలు తమ మనుగడను సాగించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల కంటే ఎక్కువగా తమ గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్లు తదితర కార్యక్రమాల ద్వారా వచ్చే సాధారణ నిధులతోనే నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించేవి. ఏటా సక్రమంగా నిధులు రాకపోవడం, ప్రభుత్వాల పట్టింపులేని తనంతో పల్లెలు క్రమంగా అభివృద్ధికి దూరమయ్యాయి. రానురాను తమ ఉనికిని కోల్పోయాయి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతితో పల్లెలు తిరిగి జీవం పోసుకున్నాయి. ఎన్నో అవార్డులతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
‘పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు’ అన్న గాంధీ మాటలే స్ఫూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతిపై దృష్టి సారించారు. స్వరాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు ‘పల్లె ప్రగతి’ అనే యజ్ఞాన్ని మొదలు పెట్టారు. 2019 సెప్టెంబర్ 6న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ప్రతి పంచాయతీకి నేరుగా నిధుల వరద పారించారు. ఆ నిధులతో గ్రామాల రూపురేఖలు ఎలామార్చాలో మార్గదర్శనం చేశారు. ప్రతి జీపీకీ ప్రతి నెలా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా నిధులు ఇస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు సగటున జిల్లాకు ఏడాదికి 405 కోట్లను మంజూరు చేస్తున్నది. 47 నెలల కాలంలో ఉమ్మడి జిల్లాకు 1586.25కోట్లు వచ్చాయి. ఈ నిధులతో 1215 జీపీల పరిధిలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. దాదాపు 4,201 కిలోమీటర్ల పొడువున ఉన్న అంతర్గత రోడ్లు నిరంతరం శుభ్రం చేయబడుతున్నాయి. అలాగే 2,400 కిలోమీటర్ల పొడవున ఉన్న మురుగు కాలువలు సైతం శుభ్రమవుతున్నాయి. గతంలో నిధుల లేమితో పారిశుధ్య కార్మికులను సైతం నియమించుకోలేని దుస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా జనాభా ప్రాతిపదికన నిధులను మంజూరు చేస్తూ వాటి వ్యయం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కచ్చితంగా ప్రతి గ్రామం పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని ఆదేశించింది. దాంతో గ్రామ పంచాయతీలు పారిశుధ్య కార్మికులను నియమించుకున్నాయి. సగటున 500 జనాభాకు ఒక పారిశుధ్య కార్మికుడిని నియమించాయి. గతంలో పంచాయతీ పారిశుధ్య కార్మికుడికి వేతనం అతి తక్కువ ఉండగా, స్వరాష్ట్రంలో పెరిగింది. ప్రతి కార్మికుడికి నెలనెలా 8500 ఇస్తుండగా, ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి వేతనాలు చెల్లించబడుతున్నాయి. చెత్తను తొలగించి డంప్యార్డుకు తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీ, అలాగే వాటర్ ట్యాంకర్ను ప్రతి గ్రామంలోనూ సమకూర్చుకున్నారు. అలాగే గ్రామానికి ఉన్న ఆదాయ వనరులను బట్టి ట్రైసైకిల్స్ను కూడా వినియోగిస్తున్నారు.
వెలిచాలకు జాతీయ స్థాయి గుర్తింపు
వెలిచాల.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఉంటుంది. సుమారు ఐదు వేల జనాభా ఉన్న ఈ గ్రామం, ఇప్పటికే జాతీయ స్థాయిలో రెండు, రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు సాధించింది. ఈ గ్రామం పారిశుధ్య నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది. ఊరంతా చెట్లతో నిండి ఉండి పచ్చదనాన్ని పంచుతున్నది. అందుకే క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలోనే రెండు సార్లు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారాన్ని అందుకున్నది. 2016-17లో ఒకసారి, 2021-22లో మరోసారి ఈ అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే గతేడాది నీటి సమృద్ధి గ్రామంగా ఎంపికై రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. గ్రామంలో ప్రతిరోజూ తడి, పొటి చెత్త వేరు వేరుగా సేకరించి డంప్ యార్డుకు తరలించి వృథా చేయకుండా కంపోస్టు ఎరువుగా మార్చి పంచాయతీ పరిధిలో నాటిన చెట్లకు వాడు కోవడమే కాకుండా రైతులకు విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుతున్నది. మూడు శివారు పల్లెలతో ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికే 8 వేల మొక్కలు నాటగా అవి వృక్షాలుగా ఎదుగుతున్నాయి. పారిశుధ్య సిబ్బంది నిబంధనలను పాటిస్తూ గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతున్నారు. గ్రామంలో చుడ చక్కని పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా 20 లక్షలు వెచ్చించి గ్రామంలోని యువకుల కోసం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతోనే తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు చెబుతున్నారు. తమ గ్రామ ప్రజల సహకారంతో ఇప్పటికే రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు సాధించామని ఆమె పేర్కొన్నారు.
సుల్తాన్పూర్ ఆదర్శం
1959లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన సుల్తాన్పూర్, నాటి పాలనలో పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. జీపీ కార్యాలయం, పీహెచ్సీ సబ్ సెంటర్ భవనం, రెండు ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలమై కళా విహీనంగా దర్శనమిచ్చేవి. ఫలితంగా 20 ఏండ్ల సంది పీహెచ్సీ సబ్ సెంటర్లో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు. కానీ, పల్లె ప్రగతితో సుల్తాన్పూర్ ఆదర్శంగా నిలిచింది. పీహెచ్సీ సబ్సెంటర్ భవనంతోపాటు రెండు ప్రాథమిక పాఠశాలలకు మరమ్మతులు చేయించారు. కొత్తగా 40లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. స్వచ్ఛత విషయంలో గ్రామస్తులు కూడా సహకరిస్తూ,రచెత్త బుట్టలను వినియోగిస్తున్నారు. ఉదయం వచ్చే రిక్షాల్లో చెత్తను వేస్తున్నారు. ఈ వ్యర్థాలను నేరుగా చెత్త సేకరణ కేంద్రానికి(సెగ్రిగేషన్ షెడ్) తరలిస్తున్నారు. చెత్త సేకరణ ద్వారా రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయిస్తున్నారు. దీనికి తోడు కంపోస్టు ఎరువులు తయారు చేసి బ్యాగులుగా చేసి రైతులకు విక్రయిస్తున్నారు.
అవార్డులే అవార్డులు
పల్లె ప్రగతిలో చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లా జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను కైవసం చేసుకున్నది. పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, మంథని, ధర్మారం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాలు వరుసగా జాతీయ స్థాయిలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారాన్ని పొందాయి. ఇక రాఘవాపూర్, ఆదివారంపేట, సుందిళ్ల గ్రామాలు జాతీయ స్థాయిలో నానాజీదేశ్ముఖ్ అవార్డులను గెలుచుకున్నాయి. ఇక సంతత్ వికాస్ విభాగంలో సుల్తాన్పూర్ గ్రామం అవార్డును కైవసం చేసుకున్నది. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 9 గ్రామాలు, 5 మండలాలు జాతీయ అవార్డులతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామాలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డును జాతీయ స్థాయిలో గెలుచున్నాయి. 2014-15లో ఉమ్మడి కరీంనగర్ జడ్పీ అవార్డును కైవసం చేసుకోగా, తదుపరి నుస్తులాపూర్, తిమ్మాపూర్ మండలాలు జాతీయ అవార్డును పొందాయి. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, వెల్గటూర్ మండలాతోపాటు మల్లాపూర్ మండలం నడికుడ, కోరుట్ల మండలం పైడిమడుగు, కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి.
దహన సంస్కారాలకు బాధలు తప్పినయ్
భూపతిపూర్ రాయికల్ మండలంలోని ఒక గ్రామం. ఒకరకంగా ఇది పెద్ద గ్రామంగానే గుర్తింపు పొందింది. అయితే నాడు గ్రామంలో ఎవరైనా కాలం చేస్తే.. శ్మశానవాటిక లేక అంత్యక్రియలు చేయడం పెద్ద సమస్యగా ఉండేది. వీలైనంత వరకు ఎవరి వ్యవసాయ భూముల్లో వాళ్లు దహన సంస్కారాలు చేసేకునే దుస్థితి. ఇక దహనం అనంతరం స్నానాలు చేయడం మరో యాతన. వ్యవసాయ పంపుసెట్లే దిక్కయ్యేవి. లేకపోతే ఎస్సారెస్పీ కాలువ నీళ్లు వస్తే అక్కడ చేయాల్సిందే. తదుపరి పన్నెండు రోజులపాటు నిర్వహించుకోవాల్సిన క్రతువులు మనిషిని కోల్పోయిన కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారేవి. వానకాలంలో కాలం చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దశాబ్దాల పాటు ఇదే దుస్థితి కొనసాగింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి ఈ సమస్యకు పరిష్కారం చూపింది. గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో 10 లక్షల వ్యయంతో వైకుంఠధామం నిర్మించారు. పదిగుంటల స్థలంలో ఒకేసారి రెండు మృతదేహాలను దహనం చేసేందుకు, వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేలా నిర్మాణం చేపట్టారు. క్రతువుల కోసం రెండు గదుల నిర్మాణం సైతం పూర్తి చేశారు. బోరు, నల్లాలు ఏర్పాటు చేశారు. ఆడవారికి, మగవారికి వేర్వేరుగా స్నానపుగదులు నిర్మించారు. ఈ విషయమై భూపతిపూర్ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైకుంఠధామం నిర్మాణంతో అంతిమ సంస్కారాలకు ఏండ్లుగా పడిన ఇబ్బందులు దూరమయ్యాయని చెప్పారు.
నేడు పల్లె ప్రగతి దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలు, సంక్షేమ పథకాలతో ప్రజలకు జరిగిన లబ్ధి, మౌలిక వసతుల వివరాలను ప్రకటించనున్నారు. సర్పంచులు, ఎంపీపీలకు సన్మానం చేయనున్నారు.