బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతపల్లి కొలువుల ముల్లెగా మారిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాలతో నిండిన ఆ గ్రామం, సర్కారు ఉద్యోగాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. చిన్న ఊరే అయినా 40 మందికిపైగా ప్రభుత్వోగులు, 20మందికిపైగా ప్రైవేట్ ఉద్యోగులతో ఆదర్శంగా నిలుస్తున్నది.
– బోయినపల్లి, ఏప్రిల్ 29
Ananthapalli | బోయినపల్లి, ఏప్రిల్ 9: అనంతపల్లి.. మారుమూల చిన్న పల్లె. వ్యవసాయ ఆధారిత గ్రామం. బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువ. కూలీ పనే జీవనాధారం. 1530 జనాభా, 1240 ఓటర్లు, 350 కుటుంబాలు ఉన్నా.. ఈ ఊరికో ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రామంలో 40 మందికిపైగా ప్రభుత్వోగ్యాలు సాధించారు. ఒకరిని చూసి మరొకరు ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు. గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు యువత తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయగా, సీరియస్గా ప్రిపేరవుతున్నారు. ఉద్యోగ రీత్యా చాలా మంది వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుండగా మరి కొందరు అక్కడే స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా సెలవుల్లో మాత్రం ఇక్కడికి వచ్చి గడుపుతున్నారు.
దేశ, విదేశాల్లోనూ కొలువులు
అనంతపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దేశ, విదేశాల్లో సాఫ్ట్వేర్ కొలువుల్లోనూ చాలా మంది స్థిరపడ్డారు. అమెరికాలో పది మంది, కెనడాలో వంగపల్లి అరవింద్రెడ్డి, వంగపల్లి జగన్రెడ్డి, లండన్లో ముగ్గురు, ఆస్ట్రేలియాలో శ్రీ చరణ్, జర్మనీలో సతీశ్ సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నారు. హైదరాబాద్తోపాటు ఇతర పట్టణాల్లో మరో 20 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులున్నారు. ఉమ్మెంతుల హర్షవర్ధన్రెడ్డి హైకోర్టులో న్యాయవాది కాగా, కన్నం అనిల్కుమార్, గంగాధర సుదర్షన్, కన్నం సుదర్శన్ న్యాయవాదులుగా పని చేస్తున్నారు.
కన్నం మధు, హైదరాబాద్ ఏఆర్ సీఐ చంద్రగిరి ఆనందం, హుజూరాబాద్ ఏఎస్ఐ చంద్రగిరి మధు, ఇల్లంతకుంట పంచాయతీ కార్యదర్శి గడ్డం స్వామి కండక్టర్ హైదరాబాద్ కన్నం ఆనందం, రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ టీచర్.
కన్నం ఆశోక్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్, నిర్మల్ గంగాధర రమేశ్, ప్రభుత్వ టీచర్ ఆరేపల్లి సంజీవ్, పోలీస్ కానిస్టేబుల్, కరీంనగర్ జాగిరి సురేశ్, సిరిసిల్లలో 17 బెటాలియన్ ఏఎస్ఐ కన్నం రమేశ్, ప్రభుత్వ పాఠశాల, హెచ్ఎం, తంగళ్లపల్లి చంద్రగిరి సంతోష్, ఆర్ఐ, ఇల్లంతకుంట వంగపల్లి మోహనమ్మ, ప్రభుత్వ టీచర్, కోరుట్ల యముండ్ల మహేశ్, పీసీ, హైదరాబాద్ యామ సాయి, ఎయిర్ఫోర్స్ ఉద్యోగి గైసెట్టి హరీష్, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, మధ్యప్రదేశ్ గంగాధర వసంత్, ప్రభుత్వ టీచర్ రోమాల లచ్చయ్య, టీచర్, సిరిసిల్ల ఎమిరెడ్డి కిషన్రెడ్డి, ప్రభుత్వ టీచర్, పెగడపల్లి, ఎమిరెడ్డి పద్మ, ప్రభుత్వ టీచర్, కొడిమ్యాల మోతె గణేశ్, ముంబాయి నేవిలో ఉద్యోగి కన్నం నారాయణ, తహసీల్దార్ బావండ్ల లక్ష్మణ్, కండక్టర్,హైదరాబాద్ ఉమ్మెంతుల రమణి, ప్రభుత్వ టీచర్, ఆర్నకొండ వంగపల్లి ఆశ, ప్రభుత్వ టీచర్, చెప్యాలగొడిసెల శేఖర్, పీసీ, వేములవాడ గంగాధర స్వప్న, పీసీగంగాధర సురేశ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ కన్నం మమత, ఫీమేల్ హెల్త్ సూపర్ వైజర్, ఇల్లంతకుంట గురుకుల స్కూల్
సెలవు దొరికితే గ్రామానికి వస్తా
మాది చాలా పేదకుటుంబం. ఎప్పుడూ కష్టాలు, కన్నీళ్లే. చిన్నప్పటి నుంచి అనేక సమస్యల మధ్యే పెరిగా. చదువుతోనే మా జీవితమని మా తల్లిదండ్రుల మాటలను సీరియస్గా తీసుకున్నా. డిగ్రీ పూర్తి చేసినా. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలనే లక్ష్యంతో కష్టపడ్డా. తొలుత ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యా. మూడేళ్లు ఉద్యోగం చేసి మళ్లీ 2012లో ఏఆర్లో ఎస్ఐగా జాబ్ సాధించా. రెండేళ్ల క్రితం సీఐగా పదోన్నతి వచ్చింది. హైదరాబాద్లో చేస్తున్నా. నా తమ్ముడు అనిల్ కుమార్కుమార్ ఎల్ఎల్బీ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెల్లెలు మమత ఇల్లంతకుంట మండలం గురుకుల పాఠశాలలో మహిళ హెల్త్ సూపర్ వైజర్. ఎప్పుడైనా సెలవు దొరికితే గ్రామానికి వచ్చి అందరిని కలిసి యోగ క్షేమాలు పంచుకుంటా.
– కన్నం మధు, ఏఆర్ సీఐ
పండుగలకు ఊళ్లో వాలిపోతా..
మాది పేద కుటుంబమే. కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించా. ప్రస్తుతం కోరుట్ల పాఠశాలలో పనిచేస్తున్నా. ఉద్యోగ రీత్యా అక్కడే ఉంటున్నా. దసరా, దీపావళీ, బతుకమ్మ లాంటి పెద్ద పండుగలకు మాత్రమే కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వస్తుంటా. స్థానికంగా ఉండలేకపోడం బాధగా ఉంది. కానీ వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతుంటా. ఊరంతా చక్కర్లు కొడతా. అందరి యోగక్షేమాలు తెలుసుకుంటా.
– వంగపల్లి మోహనమ్మ, ప్రభుత్వ పాఠశాల టీచర్
సంతోషంగా ఉన్నది.
నేను బాల్యం నుంచి కష్టాల మధ్యే పెరిగా. కష్టపడి చదివి సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ కొలువు సాధించా. మధ్యప్రదేశ్లో చేస్తున్నా. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను దేశం కోసం పని చేస్తుండడం సంతోషంగా ఉంది. మధ్యప్రదేశ్లోని సీఆర్పీఎఫ్లో ఐజి అధికారి వద్ద విధులు నిర్వర్తిస్తున్నా. నా భార్య, ఇద్దరు కొడుకులు అనంతపల్లిలోనే ఉంటారు. సెలవులు ఇచ్చినప్పుడు, పండుగలప్పుడు వీలైతేనే వస్తా. కనీసం 20 రోజులైనా గ్రామంలో ఉండి సరదాగా గడుపుతుంటా.
– గైసెట్టి హరీశ్, సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్
చదువుకుంటేనే జీవితం..
అనంతపల్లి చిన్న గ్రామమే అయినప్పటికీ ఒకరిని చూసి ఒకరు కష్టపడి చదివి కొలువు సాధించాం. నేను ఏఎస్ఐగా హుజూరాబాద్లో చేస్తున్నా. విద్యార్థులు, యువతకు నేనొక్కటే చెబుతున్నా. చదువుతోనే జీవితం. విలువైన సమయాన్ని వృథాచేయకుండా కష్టపడి చదివి అనుకున్నది సాధించాలి. అలా కష్టపడే ఊరు నుంచి ఇంత మది ఉద్యోగులం తయారయ్యాం. ఒకప్పుడు పోలీస్ ఉద్యోగం అంటే అందరు భయపడిపోయేవారు. ప్రతి శాఖ, డిపార్ట్మెంట్లో ఒడిదుడుకులు ఉండడం సహజం. ఉన్నత విలువలతో కూడిన జాబ్ కాబట్టి, ఇప్పుడు చాలా మందే పోటీపడుతున్నారు.
– చంద్రగిరి ఆనందం, ఏఎస్ఐ
ఇల్లంతకుంటలో ఉద్యోగం..
బాల్యం నుంచి కష్టాల మధ్యే పెరిగా. మాది చాలా పేద కుటుంబం. కష్టపడి చదివి వీఆర్వో ఉద్యోగం సాధించా. కొన్నేళ్లు విధులు నిర్వర్తించిన తర్వాత ఆర్ఐగా పదోన్నతి వచ్చింది. ప్రస్తుతం ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నా. బోయినపల్లి మండలానికి సమీపంలోనే కావడంతో అనంతపల్లి నుంచి రోజూ విధులకు వెళ్లి తిరిగి వస్తున్నా. మా ఊళ్లో చాలా మంది ఉద్యోగాలు సాధించడం, కొలువుల పల్లెగా నిలిచిపోవడం సంతోషంగా ఉంది.
– చంద్రగిరి సంతోష్, ఆర్ఐ
సంతోషంగా ఉంది..
మాది చిన్నగ్రామం. కానీ ఇంత మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉండడం సంతోషంగా ఉంది. గ్రామంలోని యువత ఒకరిని చూసి మరొకరు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఊళ్లో అన్ని సామాజిక వర్గాల నుంచి విద్య, వైద్య, రెవెన్యూ, న్యాయవాదులు, పోలీస్ శాఖలల్లో కొలువులు చేస్తున్నవారు ఉన్నారు. ఇంకా అమెరికా ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ కొలువుల్లో చాలా మందే స్థిరపడ్డారు. ఉద్యోగుల ఊరుగా మా గ్రామానికి పేరురావడం గర్వంగా ఉంది.
– వంగపల్లి సత్యనారాయణరెడ్డి, సర్పంచ్
తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నాకు ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు ఎన్నో ఉద్యోగాలకు ట్రై చేశాను. కానీ, రాలేదు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలు వేసింది. 2018లో నాకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లోకానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
-యముండ్ల మహేందర్, కానిస్టేబుల్
లక్ష్యంతో చదివా.. సాధించా
మా ఊరిలో చాలా మంది ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసి నేను ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదివా. తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్స్కు ప్రిపేరైనా. 2018లో ప్రభుత్వం వేసిన ట్రాన్స్-కో నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించినా. మొదట కరీంనగర్లో జేఏవోగా పని చేశాను. తర్వాత సంస్థగత బదిలీలో హన్మకొండకు ట్రాన్స్ఫర్ అయినా. ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేస్తున్నా. చాల సంతోషంగా ఉన్నది.
-సావనపల్లి నరేశ్, జేఏవో
తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి
తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్పల్లి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా. ఉద్యోగ రీత్యా స్వగ్రామానికి దూరంగా ఉండాల్సి వస్తున్నది. బాధగా ఉన్నప్పటికీ తప్పదు కదా. కానీ ఒక ఉపాధ్యాయుడిగా దేశ భవిష్యత్ను నిర్ణయించే గొప్ప విద్యార్థులను తయారు చేస్తున్నాననే సంతోషం కూడా ఉన్నది. విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. చక్కగా చదువుకోవాలి. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.
– గంగాధర రమేశ్, ప్రభుత్వ టీచర్