కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణప్రతినిధి) : అమెరికా అదో అగ్రరాజ్యం.. యువతకు అదో కలల సౌధం.. ఒక్కసారి వెళ్తే చాలు తమ జీవితాలకు తిరుగుండదనే నమ్మకం.. అక్కడ ఉద్యోగం, జీతం స్టేటస్ సింబల్.. ఇది యువతీ యువకులే కాదు, తల్లిదండ్రులందరూ చెప్పే మాటా ఇదే! కానీ, ఆ ఆశల సౌధం కొద్ది నెలల నుంచి మెల్లమెల్లగా కుప్పకూలుతున్నది. ఇటీవలి కాలంలో ఐటీ దిగ్గజ సంస్థలు వరుసబెట్టి తమ ఉద్యోగులను తొలగిస్తుండడం మనోళ్లను కలవర పెడుతున్నది. ఇప్పటికే రెండు లక్షలపైగా కొలువులు ఊడగా, అందులో మన ఉమ్మడి జిల్లాకు చెందిన వారే వేలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ తర్వాత ఉద్యోగాలు, చదువుల కోసం అత్యధికంగా అమెరికా వెళ్తున్న వారిలో మనోళ్లే ఎక్కువగా ఉండగా, జాబ్స్ తొలగింపు అక్కడున్న వారినే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రులనూ టెన్షన్కు గురి చేస్తున్నది.
ఆర్థిక సంక్షోభం పేరిట కొన్ని నెలలుగా అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ దిగ్గజ సంస్ధలు హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై ఉన్న ఉద్యోగులను తొలగిస్తుండడం కలవరపెడుతున్నది. దీని ప్రభావం అమెరికాలో ఉన్న మనోళ్లపై పడుతున్నది. అక్కడ తొలగింపునకు గురైన వారు తిరిగి 60 రోజుల్లోకొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే గడువు ముగిసిన పది రోజుల్లోగా ఆ దేశాన్ని వదలి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి.
ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం అక్కడ ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి కొరత ఉండేది. దాంతో నైపుణ్యమున్న విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు. ఎల్-1 అనేది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫరీ వీసా. పెద్ద బహుళజాతి సంస్థలు వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ప్రత్యేక హోదాలో ఉన్న ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన యునైటేడ్ స్టేట్స్కు బదిలీ చేయడం ఈ వీసా పరిధిలోకి వస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం ఐటీ కంపెనీలు తొలగిస్తున్నవారిలో హెచ్-1బీ వీసా వారే అధికంగా ఉన్నారు.
మన ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలుచేస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉన్నది. ఇక తమ పిల్లలకు ఢోకాలేదని తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో ఐటీ సంస్థలు ఉద్యోగుల తొలగింపునకు పాల్పడుతుండడం కలవరపెడుతున్నది. సదరు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఉద్యోగం దొరక్కపోతే పిల్లలు అక్కడి ఎలాంటి ఒత్తిడికి లోనవుతారోనని భయపడిపోతున్నారు. అంతేకాదు, కొంత మంది యువతీ యువకులు వారు తమ ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ తమ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పడం లేదని అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. పరిస్థితి అంతా ఆగమ్య గోచరంగా ఉందని చెబుతున్నారు.
పై చదువులకు ఏటా 1500 మంది
ఉమ్మడి జిల్లాలో 13 ఇంజినీరింగ్ కళాశాలున్నాయి. అందులో రెండు ప్రభుత్వ, 11 ప్రైవేటు కళాశాలున్నాయి. అన్ని కోర్సులు కలిపి 3,782 సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా మన ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో అనేక ఇంజినీరింగ్ కాలేజీల్లో పట్టాలు తీసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం పైచదువుల కోసం అమెరికాకు వెళ్తున్న వారిలో ఒక్క హైదరాబాద్ నుంచే 10 నుంచి 12వేల మంది యువతీ యువకులు ఉండగా, ఆ తదుపరి స్థానంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లానే ఉంది. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డీసీ, కాలిఫోర్నియా, మిచిగాన్, తదితర రాష్ర్టాల్లో జిల్లాకు చెందిన వేలాది మంది చదువుతోపాటు ఉపాధి పొందుతున్నారు.
2000 సంవత్సరం నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజా అంచనాల ప్రకారం.. ఏటా ఉమ్మడి జిల్లానుంచి పైచదువుల కోసం 1400 నుంచి 1600 మంది వెళ్తున్నారు. అమెరికాలో సుమారు 4500 వరకు ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలుండగా, వాటిని ర్యాకింగ్ల ఆధారంగా టైర్-1, 2, 3లుగా వర్గీకరిస్తారు. వాస్తవానికి టైర్-1, 2 లు 500కు మించి ఉండవన్నది నిపుణల మాట. అక్కడి ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు ఆయా విద్యాసంస్థలకు ర్యాంకింగ్లు అక్రిడిటేషన్లు ఇస్తుంటాయి. అయితే ప్రభుత్వ వర్సిటీలు నాణ్యమైనవి.
ప్రైవేటు నాసిరకమైనవి అని చెప్పలేం. కొన్ని స్కాలర్ షిప్లు మంజూరు చేస్తే.. మరికొన్ని చేయవు. వీటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయా వర్సిటీల వెబ్సైట్లను, యుఎస్ కాన్సులేట్ వెబ్సైట్లను పరిశీలిస్తే అవగాహన ఏర్పడుతుందని నిపుణులు వివిధ సమయాల్లో సూచిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని ఉన్నత విద్య కోసం మెజార్టీ యువతీ యువకులు అమెరికా బాట పడుతున్నారు. కన్సెల్టెన్సీల ద్వారా ఒక్కో విద్యార్థి నాలుగు నుంచి ఐదు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకొని సీటొచ్చిన విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్తున్నారు.
కొత్త వారి పరిస్థితి ఏంటి?
పై చదువులు చదువుతున్న సమయంలోనే పార్ట్టైం ఉద్యోగం చేసి, కోర్సును పూర్తిచేసి అక్కడే స్థిరపడాలన్న లక్ష్యంతోనే వెళ్లేవారే 99శాతం మంది ఉంటున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి మరీ పంపిస్తున్నారు. అంతేకాదు, తమ పిల్లలు అమెరికాలో చదువుతున్నారని కొంతమంది, అక్కడే ఉద్యోగంచేస్తూ స్థిరపడుతారని మరికొంతమంది స్టేటస్గా చెప్పుకునేందుకైనా పంపిస్తున్నారు. అయితే తాజాపరిస్థితులు మా త్రం కలవరపెడుతున్నాయి.
భవిష్యత్లో ఆర్థిక సంక్షోభం రాబోతుందని, ముందస్తుగా తమ వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ ఐటీ దిగ్గజ సంస్థలే చెబుతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పట్లో ఆర్థికపరిస్థితులు చక్కబడుతాయా..? లేదా..? అన్నదానిపై అనేక సందేహాలు ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. గత విద్యా సంవత్సరం వెళ్లిన వారంతా ఈయేడాదిలో వారి కోర్సులు పూర్తిచేసుకోనుండగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తే వారికి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈవిషయంలోనూ తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యకమవుతున్నది. మొత్తంగా కలలసౌధంపై పెట్టుకున్న ఆశలు కల్లలుగానే మిగిలిపోతాయన్న భయం ప్రతిఒక్కరిలోనూ కనిపిస్తున్నది.