పెద్దపల్లి రూరల్, జనవరి 28: యాసంగి వరిపై మొగిపురుగు దెబ్బకొడుతున్నది. నెలరోజుల నుంచి ప్రతాపం చూపుతుండగా, రైతాం గం ఆందోళన చెందుతున్నది. ఈ యేడు దిగుబడి తగ్గుతుందేమోనని కలవరపడుతున్నది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పొలంబాట పట్టారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి పొలాస, కూనారం శాస్త్రవేత్తలను రంగంలోకి దించారు. శనివారం వారితో కలిసి పెద్దపల్లి మండలంలోని కనగర్తి, బొంపల్లిలోని పొలాలను పరిశీలించారు. తెగులు ఉధృతిని పరిశీలించారు. స్వయంగా రైతులతో మా ట్లాడారు. అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సర్కారు ద్వారా ఎలాంటి సాయం అం దించేందుకైనా సిద్ధంగా ఉంటామని అభయమిచ్చారు. అలాగే అగ్రికల్చర్ అధికారులు నిరంతరం రైతాంగానికి అందుబాటులో ఉండాలని సూచించారు. తెగులు వ్యాప్తికి గల కారణాలను అన్వేషించి రైతులకు నివారణ, నిర్మూలనకు తగిన సూచనలు చేయాలని కోరారు. ఆయనవెంట పొలాస శాస్త్ర వేత్తలు రజినీకాంత్, ఓంప్రకాశ్, బలరాం, కూనారం పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్సిద్ధిఖ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు శ్రీనాథ్, మండల వ్యవసాయశాఖ అధికారి కాంతాల అలివేణి, ఆర్బీఎస్ మం డలాధ్యక్షుడు ఇనుగాల అనంతరెడ్డి, పెద్దపల్లి మండల ఆదర్శరైతు ఎర్రం మల్లారెడ్డి ఉన్నారు.
మొగిపురుగు నివారణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పొలాస శాస్త్రవేత్త ఓంప్రకాశ్ అన్నారు. మొగిపురుగు బారిన పడ్డ పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సూచనలు చేశారు. నాటేసిన 15 నుంచి నెల రోజుల్లోగా టాటాఫ్ హెడ్రాక్ 4జీ గుళికలను ఎకరాకు 8 కిలోల చొప్పున గాని, కార్బోజిఫిరాన్ 3జీ గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున గాని, క్లొరాన్ ట్రానికోల్ గుళికలను ఎకరాకు 4 కిలోల చొప్పున వేయాలని కోరారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని తక్కువగా పెట్టుకోవాలని నిర్దేశించారు.