కోరుట్ల, ఆగస్టు 13: చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ సూచించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్ సమీపంలోని మైదాన ప్రాంగణంలో జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ రాజకీయ యుద్ధ భేరీ సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. తనకు 30 ఏళ్ల వయసున్నప్పుడు జగిత్యాలలో పద్మశాలీ గర్జన సభ జరిగిందని, వేలాదిగా తరలివచ్చిన పద్మశాలీల స్ఫూర్తితో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు. పద్మశాలీ కులస్థుల సహకారంతో చట్ట సభకు ఎన్నికై ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించినట్లు పేర్కొన్నారు. పద్మశాలీలు సంఘటితమై ఐకమత్యంతో మెదిలి తమ గౌరవాన్ని, ప్రతిష్టతను పెంచుకోవాలని సూచించారు. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించినప్పుడు మాత్రమే తమ న్యాయమైన కోర్కెలు సాధించుకోగలుగుతామన్నారు. పార్టీలకతీతంగా చట్టసభలకు పద్మశాలీ బిడ్డలను పంపించుకోవాల్సిన అవశ్యకతను గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘం భవనాలు, పద్మశాలీ సంఘ భవనాల ఖాళీ స్ధలాల రక్షణకు కృషి చేస్తానని చెప్పారు. చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడుతానన్నారు. కోరుట్ల సభకు ఇంత పెద్ద సంఖ్యలో పద్మశాలీలు తరలిరావడం అభినందనీయమన్నారు.
పద్మశాలీలకు తెలంగాణ తలమానికం : కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్
పద్మశాలీలకు తెలంగాణ రాష్ట్రం తలమానికమని కర్నూలు ఎంపీ సంజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని పద్మశాలీ కులస్తుల ఆధరాభిమానాలు పొందే భాగ్యాన్ని కలిగించిన పద్మశాలీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలతో తనకు జన్యుపరమైన సంబంధమే ఎక్కడో 400 కిలో మీటర్ల దూరం నుంచి సభకు రప్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. పద్మశాలీలు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారని, తన పోరాటం వల్ల పద్మశాలీలకు నాలుగు కార్పొరేషన్లు దక్కాయన్నారు. అక్కడి సీఎంను ఒప్పించి చేనేత కార్మికులకు పింఛన్లు సాధించినట్లు చెప్పారు.
ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి
ఇంత భారీ సంఖ్యలో బీసీలు ఒక్కచోట చేరడం దక్షిణ భారతదేశంలో ఇదే ప్రథమమని, పద్మశాలీలు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దాలని ఆత్మగౌరవ సభ నిర్వాహకుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ఆకాంక్షించారు. విద్యతో వినయం, సంస్కారం, ఉన్నత వ్యక్తిత్వం అలవడుతాయన్నారు. దేశంలో 19 ఏళ్లలోపు యువకులు 75 కోట్ల మంది ఉన్నారని, బీసీ యువత రాజకీయ రంగాల్లో రాణించినప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని చెప్పారు. అనంతరం పలువురు పద్మశాలీ సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులతోపాటు వరంగల్ మేయర్ గుండు సంధ్యారాణి, రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్ని అనిల్ సభనుద్దేశించి మాట్లాడారు.
పలు అంశాలపై తీర్మానం
ఈ సందర్భంగా పద్మశాలీ రాజకీయ యుద్ధ భేరీ కోరుట్ల డిక్లరేషన్ను జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ప్రవేశపెట్టారు. “పద్మశాలీలను పట్టించుకోకపోయినా, నాయకత్వాన్ని గుర్తించకపోయినా, ప్రాతినిథ్యం కల్పించకపోయినా పరవాలేదు అని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీల కళ్ళు తెరిపించాలి. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా అన్ని స్థానాల్లోనూ పద్మశాలీలలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకే మద్దతునివ్వాలి. సంఘాలను కలుపుకొని పద్మశాలీలు అంతా ఒకే రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో అవకాశం ఇప్పుడే ఉంటుంది. మరెప్పుడో కాదని ఈ సభ నినదిస్తున్నది” అని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. పద్మశాలీల కన్నా ఎకువ సంఖ్యలో ఇతర బీసీ కులాల వారు ఉన్న చోట తోటి బీసీలకు అవకాశం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని, పద్మశాలీల నాయకత్వానికి అవకాశాలు కల్పించిన స్థానాల్లో రాజకీయాలకతీతంగా పార్టీలను పకనపెట్టిన మన వారినే గెలిపించుకోవాలని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పద్మశాలీ కులస్తుల సంఖ్య బలం ఎక్కువగా ఉన్న 23 నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు టికెట్లు ఇవ్వాలని కోరారు.
కోరుట్ల సభకు సుమారు 50 వేల పై చిలుకు పద్మశాలీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలతో పాటు 7 రాష్ర్టాల నుంచి పద్మశాలీ కులస్తులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, యువకులు సభలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది పద్మశాలి కులస్తులతో కోరుట్ల జన సంద్రమైంది. ఎక్కడ చూసిన వాహనాల, జనం రాకపోకలతో సందడిగా మారింది. సభకు వచ్చిన ప్రజలకు వేదిక సమీపంలో నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సమావేశంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ రమా శ్రీనివాస్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, రాజన్న సిరిసిల్లా జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, నాయకులు బోగ శ్రావణి, బస్వరాజు సత్యనారాయణ, జక్కుల ప్రసాద్, గడ్డం మధు, రోశం బాలు, మార్త రమేశ్, పాల్గొన్నారు.