హనుమాన్చాలీసా పారాయణంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ
వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
108 సార్లు చాలీసా పారాయణ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ
మల్యాల, మే 17 : కొండగట్టు అంజన్న ఆలయానికి ఈ నెల 21న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేకంగా నిర్వహించే 108 సార్లు పారాయణ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా అంజన్న ఆలయ సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈనెల 21న ఉదయం 7.41 గంటల నుంచి అంజన్న ఆలయ ప్రాంగణంలో లోక కల్యాణార్థం నిర్వహించే చాలీసా పారాయణ కార్యక్రమ పోస్టర్ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం ఆవిష్కరించారు. హనుమాన్ దీక్షాపరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కొండగట్టు ఆలయ స్థానాచార్యుడిగా కపీందర్
కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ స్థానాచార్యులుగా కపీందర్ను సెలక్షన్ కమిటీ సభ్యులు నియమించగా, ఎమ్మెల్యే రవిశంకర్ అధికారులతో కలిసి మంగళవారం నియామక పత్రం అందజేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్ రావు, సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, ఆలయ పాలకమండలి సభ్యులు వొల్లాల లింగంగౌడ్, నాయకులు దావ సురేశ్, పసుల చరణ్, ముత్యాల రాంలింగారెడ్డి, జనగం శ్రీనివాస్, త్రినాథ్, నీలగిరి రాజేందర్రావు, ఆగంతం వంశీ, తాటిపాముల రాజేందర్, జంగిలి హన్మంతు, కోటేశ్వర్రావు, ఎడిపల్లి అశోక్ పాల్గొన్నారు.