హుజూరాబాద్టౌన్, ఆగస్టు 3: హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల రాజేందర్ స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన సమాధానం చెప్పడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రం నిధులేమీ ఇవ్వలేదని రాజేందర్ చెప్పినందుకే.. జీవోలు 354, 294 ద్వారా ప్రభుత్వం నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పానని తెలిపారు. అనామకుడిగా ఉన్న రాజేందర్కు ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, మంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చిన తండ్రి లాంటి కేసీఆర్ను ‘బొంద పెడతా.. రారా.. పోరా’ అంటూ దుర్భాషలాడడం ఆయన కుసంసారాన్ని తెలియజేస్తున్నదని కౌశిక్రెడ్డి మండిపడ్డారు.
18 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందుకే నన్ను చిన్నవాడని అంటున్న రాజేందర్ 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్పై సవాల్ విసరవచ్చా అని ప్రశ్నించారు. ఈటలను తాను కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడవచ్చని, కానీ తల్లిదండ్రులు, సీఎం కేసీఆర్ నేర్పిన సంస్కారం తనకు ఉందని, అందుకే ఆయనను పల్లెత్తు మాట అనని చెప్పారు. 2018 హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచానని చెబుతున్నాడని, అప్పుడు ఆయన వెనక కేసీఆర్ ఉండడం వల్లే ఆయన విజయం సాధించాడని, వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హుజూరాబాద్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చిందని దీనికి ఈటల ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కేసీఆర్ మార్గదర్శకంలో తాను పని చేస్తూ ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు. ‘నీ కంటే పెద్దవాడైనా కేసీఆర్పై సవాల్ చేస్తే తప్పులేదు కానీ నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి చర్చకు రమ్మంటే తప్పా’ అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. ఐదో తేదీన హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్య కేవలం అభివృద్ధిపై మాత్రమే ఆరోగ్యవంతమైన చర్చ పెట్టుకుందామని ఆయన కోరారు. ‘నేను టీఆర్ఎస్ కార్యకర్తలను, నీవు బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా చర్చించేందుకు రావాల’ని ఆయన కోరారు. చర్చకు రాకపోతే హుజురాబాద్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈటలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ కే విజయ, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, జడ్పీటీసీ సభ్యుడు పీ బకారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.