జగిత్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్, వెల్లుల్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్లో రోడ్షోలకు తండోపతండాలుగా తరలివచ్చి అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ముందుగా ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇబ్రహీంపట్నం మండలం గండి హన్మాన్ ఆలయానికి చేరుకోగా, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు.
తర్వాత గండి హన్మాన్ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా బండలింగాపూర్కు చేరుకోగా, పెద్ద చెరువు వద్ద గ్రామస్తులు, గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్కుపైగా ర్యాలీగా వెళ్లగా, దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. బండ లింగాపూర్ సంస్థానం కేంద్రంలో రోడ్ షోకు హాజరైన ప్రజలనుద్దేశించి కవిత దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. సరళమైన భాషలో, ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, వారికి ఆలోచన కలిగే పద్ధతిలో ఆమె ప్రసంగం కొనసాగింది. తెలంగాణ సాధనకు ముందు రాష్ట్రంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, నాటి పార్టీలు, ప్రభుత్వాల పట్టింపు లేని తనం, నాటి తెలంగాణ చెరువుల పరిస్థితి, బండలింగాపూర్ చెరువు ఎండిపోయినప్పటి దుస్థితిని ఆమె ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించారు.
కాంగ్రెస్, బీజేపీల తప్పుడు విధానాలు, వాటి అభ్యర్థుల పట్టింపులేని తనంను ఆమె ఉదహరించారు. కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసుకోవాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు, తన కుటుంబానికి ఉన్న స్నేహ సంబంధాన్ని, కేసీఆర్ నిరాహారదీక్ష సమయంలో డాక్టర్గా సంజయ్ చేసిన సేవను ఆమె ప్రజలకు తెలియజేశారు. స్థానిక బిడ్డ అయిన సంజయ్ని గెలిపించాలని ఆమె కోరడంతో ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రజలు కవితతో కరచాలనం చేయడానికి సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. మహిళల ఉత్సాహం చూసిన ఎమ్మెల్సీ కవిత వారితో అక్కడే కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. బండ లింగాపూర్ తర్వాత వెల్లుల్లకు చేరుకున్న కవితకు గ్రామస్తులు గ్రామ శివారులోనే భారీ స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు ఆమెను గ్రామ పంచాయతీ దాకా ర్యాలీగా తీసుకువెళ్లారు.
వెల్లుల్లలోనూ వేలాది మందిని ఉద్దేశించి కవిత మాట్లాడారు. రోడ్ షోలో రాహుల్గాంధీ.. కాంగ్రెస్ పార్టీల తప్పుడు విధానాలను, రేవంత్రెడ్డి ధనదాహం గురించి, బీజేపీ ఎంపీ అర్వింద్ ఇష్టారాజ్య పరిభాష గురించి ప్రజలకు వివరించారు. అలాగే బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను, రేపు రానున్న రోజుల్లో చేయాలని అనుకుంటున్న మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు. వెల్లుల్లలో ఎన్నికల్లో ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్నిక రోజును పవిత్రమైందిగా భావించాలని, అయితే చాలా మంది పోలింగ్ రోజును సెలవురోజుగా భావించి, ఓటు వేయడానికి బద్దకిస్తున్నారని, ఇది సరికాదన్నారు. యువత ఓటింగ్లో పాల్గొనడంతో పాటు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కావాల్సిన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని ఆమె సూచించారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత హామీలను సైతం ఆమె వివరించారు. అనంతరం అక్కడి నుంచి ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు. అక్కడ మూడు బొమ్మల మేడిపల్లి వద్ద నుంచి ఇబ్రహీంపట్నం కొత్త బస్టాండ్ దాకా యువత 300 బైకులతో ర్యాలీ తీసి కవితకు స్వాగతం పలికారు. కొత్తబస్టాండ్ సమీపంలో ప్రసంగించారు.
ఇబ్రహీంపట్నం రోడ్ షో తర్వాత కవిత, సాయంత్రం ఐదున్నర గంటలకు మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చేరుకున్నారు. ముత్యంపేట వద్ద కవిత కోసం వేచి ఉన్న మల్లాపూర్ యువకులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్ దాకా యువకులు బైక్ర్యాలీగా వెళ్లారు. మల్లాపూర్ మండలంలోని నంది చౌరస్తా నుంచి భరతమాత విగ్రహం దాకా ప్రజలు ర్యాలీని నిర్వహించి, ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. భరతమాత విగ్రహం వద్ద ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు. చివరగా రాత్రి కోరుట్ల మండలం ఐలాపూర్కు చేరుకున్న కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ధర్మారం వంతెన నుంచి ఐలాపూర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన కవిత అక్కడ ప్రసంగించారు.
ఉదయం 12 గంటల నుంచి రాత్రి దాకా సాగిన కవిత రోడ్షో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సభలకు తరలిరావడంతో గులాబీ శ్రేణులు, కోరుట్ల బీఆర్ఎస్ నాయకులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కవిత ఐదు చోట్ల నిర్వహించిన ప్రతి రోడ్షోల్లో ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే ప్రసంగం చేశారు.ప్రతి అంశాన్ని వివరించి చెబుతూ, ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే బీఆర్ఎస్, కేసీఆర్ సీఎం కావాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రజలకు వివరించి చెప్పడంలో విజయం సాధించారు. సమావేశాల అనంతరం ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు, సీఎంగా కేసీఆర్ ఉండాల్సిన ఆవశ్యతను చర్చించడం కనిపించింది. సభలు విజయవంతం కావడంతో కోరుట్ల నియోజకవర్గంలో గులాబీ గెలుపు సంబురాలకు నాంది ప్రస్తావన ప్రారంభమైంది.