రామగిరి, డిసెంబర్ 6: సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ బాధ్యతల్లోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీనిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చొరవతో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయని, టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సంస్థను నష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను కార్మికులు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వరింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్లో కవితను కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల్లో 50 శాతం యువతే ఉన్నదని, యూనియన్లో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. యూనియన్ నాయకత్వంలో 66 శాతం అవకాశం కల్పిస్తామని చెప్పారు. 1998 నుంచి నిలిచిపోయిన కారుణ్య నియామకాలను కేసీఆర్ 2018లో పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని గుర్తు చేశారు.
కోలిండియా సంస్థలో సైతం లేనివిధంగా కారుణ్య నియామకాల ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించారని కొనియాడారు. జాతీయ కార్మిక సంఘాల కారణంగా పోయిన ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం టీబీజీకేఎస్ ఇప్పిందని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి కార్మికులకు లాభాల్లో వాటా 18శాతం ఉండగా, కేసీఆర్ దానిని 32శాతానికి పెంచారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచామమని, 35రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి సైతం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని ప్రస్తావించారు.
క్వార్టర్స్లో ఉండేవారికి బేసిక్లో ఒక శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారన్నారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం, కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయితే వేతన రక్షణ కల్పించడం, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి 10లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని వివరించారు. సంస్థను లాభాల బాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను కార్మికులు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.