‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువు ఉంటుందని ఆనాడు ఆంధ్రా ప్రాంతం వాళ్లు విమర్శలు చేసిన్రు. కానీ, ఈ రోజు ఏమైంది? సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. నేనొక్కటే చెబుతున్నా..? కొట్లాడి తెచ్చుకొని, అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుపుకున్న తెలంగాణను తెర్లు చేసుకోవద్దు. దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆమె కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా బండలింగాపూర్, వెల్లుల్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, అయిలాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి రోడ్డుషోలు నిర్వహించారు. ఆయాచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వంద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ, ఒకటి కూడా నెరవేర్చలేదని, వాళ్లు మాటమీద నిలబడేవాళ్లు కాదని విమర్శించారు. సంజయ్ కల్వకుంట్ల ఈ ప్రాంత బిడ్డ అని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జగిత్యాల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/మెట్పల్లి రూరల్/ఇబ్రహీంపట్నం/మల్లాపూర్, కోరుట్ల రూరల్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, తెలంగాణను తెర్లు చేసుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తారని, ప్రజల బతుకులు బాగుంటాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ను గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయన్నారు. కారు గుర్తుకు ఓటేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు గెలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కు మద్దతుగా బండలింగాపూర్, వెల్లుల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, అయిలాపూర్ గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి రోడ్డుషోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కవిత ప్రసంగిస్తూ.. గ్రామాల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయన్నారు.
చెరువులు ఎండినప్పుడు కప్పలు ఆ చెరువును విడిచి వెళ్లిపోతాయని, చేపలు మాత్రం చెరువు ఎండినా.. నిండినా అకడే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ వాళ్లు చేపల్లాంటి వాళ్లని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బీజేపీ ఎప్పడూ మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ దీక్ష చేసేంత వరకు ఒకరూ మాట్లాడలేదన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ వాళ్లే అన్నారు. నాడు తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని ఇందిరమ్మ కాల్చి చంపించిందన్నారు. కేసీఆర్ ఉద్యమించి, చావునోట్లో తలబెట్టి పోరాటం చేస్తే 1200 మంది పోరాటయోధుల ఆత్మత్యాగాల తర్వాత కాంగ్రెస్ వారితో పాటు, కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. చెరువులు ఎండినా నాడు ప్రజలతో బీఆర్ఎస్ ఉందని, ఇప్పుడు చెరువులు నిండిన సమయంలో సైతం ప్రజలతోనే బీఆర్ఎస్ ఉందన్నారు. కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉంటేనే మనవాడు అవుతాడని, సంతోషంగా ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు మాత్రమే మన వెంట ఉండేవాళ్లు మనవాళ్లు కాదన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణలో చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువు ఉంటుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందం టూ, ఆంధ్రా ప్రాంతం వాళ్లు విమర్శలు చేశారని, కానీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలోనే తెలంగాణను అన్నిరంగా ల్లో దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్ది వాళ్ల నోళ్లు మూయించారని చెప్పారు. ఒక చిన్న అవినీతికి తావు లేకుండా పనిచేస్తే అగ్రగామిగా రాష్ట్రం నిలిచిందన్నారు. రైతుల గురించి, ఇక్కడి ప్రజల గురించి ఏనాడూ ఒక్కరు పట్టించుకోలేదని, అలాంటి వారి కోసం సీఎం కేసీఆర్ పట్టించుకున్నారన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను రూపొందించారన్నారు. మహిళల నేతృత్వంలో ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్యం కొనుగోలు చేసే పద్ధతిని ప్రారంభించామని, గతం లో పాలకులు ఒక గింజా అయినా కొనుగోలు చేశారా..? అని ఆమె ప్రశ్నించారు. చరిత్ర మరిచిపోతే మళ్లీ ఆగమవుతామన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు.
బీడీ కార్మికుల పెన్షన్లకు కటాఫ్ డేట్ తీసేస్తామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారని, ఎన్నికల తర్వాత మూడోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోగానే, బీడీ కార్మికులందరికీ పెన్షన్లు వస్తాయన్నారు. అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ మద్దతిస్తున్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచితే, దాన్ని తగ్గించడానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, రూ.400కే సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారన్నారు. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి దీమా పేరిట ప్రతి పేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే, బీమా ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని, అందరూ బాగుండాలనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. ఒక పార్టీ వాడు వచ్చి చచ్చిపోవాలని అంటాడు. బీఆర్ఎస్ వాళ్ల తలకాయ తీసేయాలని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఇవేం మాటలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ వారికి మర్యాద ఉన్నది, బీజేపీ, కాంగ్రెస్ వారికి మర్యాద లేదని ఆమె విమర్శించారు. రైతుబంధు మొత్తాన్ని పెంచాలని కూడా సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు.
బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని, తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేసుకోవద్దని, తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ వంద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ చేశారని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాటమీద నిలబడేవాళ్లు కాదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల బతుకులు బాగుంటాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే ఆ పార్టీలే గెలుస్తాయని, బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలు గెలుస్తారని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో దక్షిణ భారత దేశంలో తొలిసారి హ్యట్రిక్ సీఎం అయ్యి కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నిమ్స్ దవాఖానలో సంజయ్ వెంటే ఉండి తమకు ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. సంజయ్ తనకు సోదరుడిలాంటివారని, ఈ ప్రాంత బిడ్డ అని, భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండలింగాపూర్ ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ సాయి రెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, రాంరెడ్డి ఉన్నారు.
కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజా అభీష్టం మేరకు అయిలాపూర్ను మండల కేంద్రంగా చేసేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించే బాధ్యత తీసుకుంటానని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ గ్రామమైన అయిలాపూర్లో జరిగిన రోడ్డులో షోలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆమె పాల్గొన్నారు. అంతకుముందు అయిలాపూర్లో రోడ్ షోకు హాజరైన కవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, సర్పంచ్ పిడుగు రాధ, పీఏసీఎస్ చైర్మన్ చింతకుంట సంజీవరెడ్డి, ఎంపీటీసీలు బోడ గంగాధర్, చింతకుంట వనిత, యూత్ మండలాధ్యక్షుడు నత్తి రాజ్కుమార్, మండలాధ్యక్షురాలు లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అబద్ధపు ప్రచారాలకు ఆగం కావద్దు : సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి
రాష్ట్రంలో 65 ఏళ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం తొమ్మిదేళ్లలో జరిగింది. ఇవన్నీ మన కళ్లముందే కనబడుతున్నాయి. చేసిన అభివృద్ధి, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం కేవలం అబద్ధపు ప్రచారాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నయి. యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. ప్రతిపక్షాల ఝూటా ప్రచారానికి ఆగం కావద్దు. ఆలోచనతో ఓటుహక్కు వినియోగించుకోవాలి.
బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి వచ్చిన అర్వింద్ పోటీ చేస్తున్నడు. కాంగ్రెస్ నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డ నర్సింగరావు బరిలో ఉన్నడు. నేను మాత్రం మెట్పల్లిలోనే పుట్టిన. ఇక్కడి బిడ్డగా పోటీ చేస్తున్నా. ఒకసారి ఆగమై బీజేపీకి ఓటేస్తే ఈ ఐదేండ్లలో మీ గ్రామాలకు ఒక్కసారైనా వచ్చిండా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని ఇక్కడ కనిపిస్తున్నడు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పర్చాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే నేను ఎన్నికల్లో పోటీచేస్తున్నా. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న మీ బిడ్డ కావాలా.. పరాయి బిడ్డ కావాలా మీరే ఆలోచించుకోవాలి.
కూరగాయాలు కూడా మనం ఏరి ఏరి జాగ్రత్తగా కొంటాం. అలాంటిది ఓటు వేసే ముందు ఎంత విజ్ఞత ప్రదర్శించాలో ఆలోచించుకోవాలి. ఒకసారి ఆగమై ఓటువేస్తే ఎంపీగా గెలిచిన వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. డా. సంజయ్ మంచి సంస్కారవంతుడు. మన ఓటును సంస్కారవంతునికి వేద్దామా.. సంస్కారహీనునికి వేద్దామా..? ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. కారు గుర్తుకు ఓటేసి డా. సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
ఎంపీగా గెలిచిన వ్యక్తి తెచ్చినానని చెప్పుకుంటున్న పసుపుబోర్డు ఎక్కడ ఉందో ప్రజలకు తెలపాలి. సత్తా ఉంటనే నాయకులవుతారు. నోటికిష్టమొచ్చినట్లు మాట్లాడే వారు ఎప్పటికీ నాయకులు కాలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీజేపీ అభ్యర్థి పడమటి నుంచి, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు నుంచి వచ్చారు. నా బిడ్డ డా. సంజయ్ మాత్రమే స్థానికుడు. ఇక్కడే పుట్టాడు. ఇక్కడే ఉంటాడు. ప్రజలందరూ కారుగుర్తుకు ఓటేసి సంజయ్ను గెలిపించి, కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయాలి.