జగిత్యాల, జూలై 4: కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలగందుల రమణ తండ్రి ఎల్జీ రాం (91) మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మృతి చెందారు. ఎల్జీ రాం జగిత్యాలలో రేడియో, సైకిల్ డీలర్, ఆ తర్వాత ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేశారు. అలాగే జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్జీ రాం హెల్త్కేర్ సొసైటీ కింద పేద ప్రజలకు వైద్య సేవలందించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ సమీపంలో ఎల్జీ రాం లాడ్జి నిర్మించి ప్రయాణికులకు సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా, మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ రమణకు ఫోన్ చేసి పరామర్శించారు.
అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్ రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కలెక్టర్ యాస్మీన్ భాషా, ఎస్పీ భాస్కర్, డీఎస్పీ భాస్కర్, డీఎంఅండ్హెచ్ఓ డా. శ్రీధర్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు మెట్ట బట్టి, గిరి నాగభూషణం, రచయిత బీఎస్ రాములు, ఇతర నాయకులు వెళ్లి ఎమ్మెల్సీని పరామర్శించారు. ఎల్జీ రాం భౌతిక కాయానికి మోతె రోడ్డులోని శంకర్ఘాట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.