పెద్దపల్లి, మార్చి 29: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతులంటే కో పం. అందుకే ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిండు. ఇప్పుడు సాగుకు నీరందించకుండా ఇబ్బందిపెడుతున్నడు. ని జంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరందించాలని’ ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు డిమాడ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి రోజంతా బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇప్పటికైనా ప్రజాసంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, పాలనలోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రజలు సాగు, తాగు నీటికి అల్లాడుతుంటే నివారణ చర్యలు చేపట్టడంలోనూ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే స్థితిలో ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే ఆదుకునేది పక్కన బెట్టి ఇతర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యారని, అందుకే బీఆర్ఎస్ నేతలను చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి ప్రజలను మభ్య పెట్టేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
కొంతమంది పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ బలహీన పడదని, రాబోయే కాలంలో మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు పెద్దపల్లిలో చేపట్టనున్న రైతు నిరసన దీక్షకు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీవైస్ చైర్మన్ మండిగ రేణుక రాజనర్సు, కాల్వశ్రీరాంపూర్ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సదానందం, పడాల సతీశ్ గౌడ్, పడాల స్వామి గౌడ్, నాగేశ్వరరావు ప్రసాద్రావు, రాజు ఉన్నారు.