భీమదేవరపల్లి/వేలేరు, నవంబర్ 11: ఎమ్మెల్యేగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రజలను కోరారు. శనివారం వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని గొల్లపల్లి, ముస్తఫాపూర్, గట్లనర్సింగాపూర్, బొల్లోనిపల్లి, రాంనగర్, విశ్వనాథకాలనీ గ్రామాల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ, కరీంనగర్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఇక్కడకు వలస వచ్చాడని ఎద్దేవా చేశారు. అక్కడ చెల్లని వ్యక్తి ఇక్కడేం చేస్తడో ప్రజలు ఆలోచించాలని కోరారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడైనా, ఏ నాయకుడైనా కులం పేరుతో వచ్చాడా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులాల ప్రస్తావన తీసుకురావడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, వచ్చిన తర్వాత అభివృద్ధిలో నియోజకవర్గం రూపురేఖలు మారాయో లేదో ప్రజలే చెప్పాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అప్పటి ప్రభుత్వం 1.14 టీఎంసీల సామర్థ్యంతో పదివేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించాలని చేపట్టిందన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం 3982 మంది భూనిర్వాసితులకు పరిహారం అందించిందని తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మళ్లీ ఢిల్లీ వాళ్ల చేతుల్లో పెడదామా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆనాడు రాత్రిళ్లు టార్చి లైటు పట్టుకుని ఎప్పుడు కరెంటు వస్తదో.. ఎప్పుడు పంటకు నీళ్లు పారియల్నో అని బావులకాడ కాపలా కాసిన రోజులను బీఆర్ఎస్ పాలనలో మర్చిపోయామన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నాయకులు ఎన్నికల ప్రచారానికి వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వారి మాయలో పడొద్దని కోరారు.
కారుగుర్తుకు ఓటు వేసి సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, వైఎస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, మాజీ ఎంపీపీ సంగ సంపత్, సర్పంచ్లు గూడ కవిత, ఎల్లమ్మ, రొంటాల ప్రభాకర్, ఎర్రబెల్లి చంద్రకళ, అర్కాల రాజు, భూక్యా కవిత, వల్లెపు అనిత, ఎంపీటీసీ సాతూరి రమాదేవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాటి మహేందర్రెడ్డి, నాయకులు నవాబ్పాషా, దార్న శ్రీనివాస్, మాక లాజరస్, గూడ రాజ్కుమార్, సల్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.