జగిత్యాల రూరల్, ఏప్రిల్ 28: అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెచ్చి దళితుల బంధువుగా నిలిచిపోయారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఒక విజన్తో దళితుల అభ్యున్నతే లక్ష్యంగా పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తన రాజకీయ ఉనికి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జీవన్రెడ్డి దళిత జాతిని అవమానపరుస్తున్నారని, బీఆర్ఎస్పైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశా న్ని, రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ దళితుల కోసం చేసిందేమిటో చెప్పాలని, ఏనాడైనా పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలోనే దళితుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశామని, దళిత జాతి ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. దేశంలోనే అతి పెద్ద అంబేదర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామని, మీ పాలనలో ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవం ఏంటో ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశా రు. తానొక్కటే అడుగుతున్నా..
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పథకమైనా అవినీతి లేకుండా అమలైందా చెప్పాలని ప్రశ్నించారు. సీనియర్ నాయకుడనే గౌరవంతో చెబుతున్నానని, ఇకనైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకోవాలని, నోటికి ఏదొస్తే అది అంమంటే కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కథ ఎప్పుడో ముగిసిపోయిందని, గల్లీలో లేదని, ఢిల్లీలో లేదని మరి దేనికోసం జీవన్ రెడ్డి ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, అనవసర ఆరోపణలు చేసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వంద సీట్లతో విజయభేరి మోగిస్తామని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బ్రహ్మాండంగా అమలవుతున్న పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందన్నారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ప్యాక్స్ చైర్మన్ సాగర్ రావు, మల్యాల ఏఎంసీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, జగిత్యాల, బీర్పూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, నల్ల మహిపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి వంశీ బాబు, నాయకులు రాజేందర్, అశోక్, కొండగట్టు ఆలయ డైరెక్టర్ సురేష్, నక గంగాధర్, నారాయణ, మల్లేశం, కోమురయ్య, గంగిపెళ్లి శేఖర్, సునీల్, ముదిగం రాజేందర్ ఉన్నారు.