అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రుల గెలుపు భారాన్ని తనయులు భుజాన వేసుకున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ తనయుడు గంగుల హరిహరణ్, చొప్పదండిలో ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ తనయుడు దీక్షిత్, హుస్నాబాద్లో ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు ఇంద్రనీల్ రంగంలోకి దిగారు. నిత్యం నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకు ఊళ్లను చుట్టేస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. వృద్ధులు, మహిళలను ఆత్మీయంగా పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని అభ్యర్థుల తరఫున హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కారు గుర్తుకు ఓటేసి, తమ తండ్రులను దీవించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. నిత్యం జనంతో మమేకమవుతూ మద్దతు కూడగడుతున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. వీరికి తోడుగా కుటుంబసభ్యులు కూడా ఇప్పటికే ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. ప్రధానంగా తండ్రుల గెలుపు కోసం కొడుకులు, కూతుళ్లు శ్రమిస్తున్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ కొడుకు హరిహరణ్, చొప్పదండిలో సుంకె రవిశంకర్ కొడుకు దీక్షిత్, హుస్నాబాద్లో వొడితల సతీశ్కుమార్ కొడుకు ఇంద్రనీల్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి తనయుడు ప్రశాంత్రెడ్డి, పుట్ట మధు తనయుడు శ్రీహర్ష, రామగుండంలో కోరుకంటి చందర్ కొడుకు మణిదీప్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని, జగిత్యాలలో డాక్టర్ సంజయ్కుమార్ తనయ హార్థిక.
వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు కూతుళ్లు నిహారిక, నివేదిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కలియదిరుగుతూ.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా హోరెత్తిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా యువతను కలుస్తూ.. చైతన్యం తెచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం తమ తండ్రులు చేసిన కృషి, రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నారో చెబుతున్నారు. మరోవైపు గడపగడపకూ వెళ్తూ ప్రభుత్వం చేపట్టిన పనులు, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని, ప్రజల జీవితాల్లో మార్పులను గమనించాలని కోరుతున్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటేసి ఆదరించాలని, తమ తండ్రులను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం తనయుడు హరిహరణ్ శ్రమిస్తున్నాడు. మొదటిసారి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో దిగడమే కాకుండా ఇతర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన స్నేహితులు, పార్టీలో యువ కార్యకర్తలతో కలిసి నగరంలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడక్కడా ప్రజలు తన దృష్టికి తెస్తున్న సమస్యలను కూడా నోట్ చేసుకుంటూ.. తన తండ్రికి వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నాడు.
మా డాడీ పోయినసారి పోటీ చేసినప్పుడు నేను చిన్నోన్ని. ఇప్పుడు కొంత తెలిసి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఈసారి మా డాడీ చేసిన అభివృద్ధి గతంల ఎవరూ చేయలే. తెలంగాణ రాక ముందు కరీంనగర్ చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు స్టేట్లనే అభివృద్ధి చెందిన నగరంగా నిలిచింది. నాకు తెలిసి రాష్ట్రంలో ఇంత స్పీడ్గా, ఇంత మంచిగా ఏ సిటీ ఇలా డెవలప్మెంట్ కాలేదు. సిటీల ఎక్కడ చూసినా రోడ్లు, లైటింగ్, పార్క్స్, కేబుల్ బ్రిడ్జి ఇట్ల ఎన్ని చెప్పినా తక్కువే. యూత్ కోసం ఐటీ టవర్ తెచ్చిండు. ఇవే విషయాలను ఓటర్లకు చెబుతున్నం. చాలా మంచిగ రిసీవ్ చేసుకుంటున్నరు. ఈసారి కూడా మా డాడీ గెలుపు ఖాయం.
– గంగుల హరిహరణ్, కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ కొడుకు
తెలంగాణ రాక ముందు మంథని నియోజకవర్గం అన్నింటా వెనుకబడ్డది. మా డాడీ ఎమ్మెల్యే, తర్వాత జడ్పీ చైర్మన్ అయినంక బాగా అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి విరివిగా నిధులు తెచ్చిండు. అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించిండు. ప్రజలు ఆలోచించాలి. మంచిచేసిన మా డాడీని గుర్తించి మంథని నుంచి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలి. కార్యకర్తలు సైతం కష్టపడి పనిచేసి మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలి.
-పుట్ట శ్రీహర్ష, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి మధు తనయుడు
బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గెలుపు కోసం కూతురు హార్దిక ప్రచారం చేస్తున్నారు. ఎంబీఏ చేసిన ఆమె, లండన్లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల వేళ తండ్రి విజయం కోసం ముందుకుసాగుతున్నారు. వారం నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ.. వృద్ధులు, మహిళలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో తన తండ్రి సంజయ్ చేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగైదు నెలల నుంచి ధర్మపురిలో ఉంటూ తండ్రి గెలుపు కోసం విశేష కృషి చేస్తున్నారు. తనదైన శైలిలో యువజన విభాగాన్ని కలుపుకుని ప్రచారంలో ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని యువతతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ నూతనోత్సాహం నింపుతున్నారు. నియోజకవర్గంలో సోషల్ మీడియా వారియర్స్ను ఏర్పాటు చేసి వారికి శిక్షణను ఇప్పించి, దాని ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నందిని భర్త అనిల్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సోషల్ మీడియాకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే పెద్దపల్లి నియోజకవర్గం అన్నింటా అభివృద్ధి చెందింది. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినయి. మా నాన్న ప్రజల కోసం నిజాయితీగా కష్టపడుతున్నడు. తన వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనబెట్టి ప్రజల కోసం నిరంతరం తపిస్తున్నడు. ప్రజలు ఆలోచించాలి. చేసిన అభివృద్ధిని గమనించాలి. సీఎం కేసీఆర్, దాసరి మనోహర్రెడ్డికి హ్యాట్రిక్ గెలుపునందించాలి. వరుసగా మూడుసార్లు విజయాన్ని కట్టబెట్టి పెద్దపల్లి నియోజకవర్గ రికార్డును బ్రేక్ చేయాలి.
-దాసరి ప్రశాంత్రెడ్డి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్రెడ్డి తనయుడు
దాసరి మనోహర్రెడ్డి తనయుడు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్రెడ్డి కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యువతతో కలిసి ర్యాలీలు తీస్తున్నారు. ఓవైపు గడపగడపకూ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. అసంతృప్త నేతలతో సమావేశమై వారిని మెప్పిస్తున్నారు.
మా డాడీ గెలుపు కోసం నా వంతుగా ప్రయత్నిస్తున్న. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న. నా ఫ్రెండ్స్, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రతీక్ అన్న (వినోద్కుమార్ కొడుకు)తో కలిసి ప్రచారం చేస్తున్న. మంచిగ అనిపిస్తున్నది. నా ఫ్రెండ్స్ చాలా మంది కష్టపడుతున్నరు. నాతో కలిసి ప్రచారం చేస్తున్నరు. గ్రామాలకు వెళ్లి మా నాన్న చేసిన పనుల గురించి చెప్తున్నం. కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి గురించి వివరిస్తున్నం. ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నరు. వాళ్ల స్పందన చూస్తే మళ్లా నాన్నే గెలుస్తరని గట్టి నమ్మకం ఉంది.
– సుంకె దీక్షిత్, చొప్పదండి అభ్యర్థి రవిశంకర్ కొడుకు
సుంకె రవిశంకర్ విజయం కోసం ఆయన తనయుడు దీక్షిత్ ప్రజలతో మమేకమవుతున్నాడు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తనయుడు ప్రతీక్రావుతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. అందులోని ఒక్కో అంశాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి అర్థమయ్యేలా చెబుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ తనయుడు కోరుకంటి మణిదీప్ తన తండ్రి గెలుపు భారాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. నియోజకవర్గంలో ని అంతర్గాం, పాలకుర్తి మండలాలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కార్మిక వాడలైన డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. తన తండ్రి రామగుండం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన ప్రజలకు వివరిస్తూ ఓట్లడుగుతున్నాడు. మణిదీప్ ప్రచారంతో యువతలో మంచి స్పందన కనిపిస్తున్నది.
మా డాడీ కోరుకంటి చందర్ రామగుండం ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అభివృద్ధి చారిత్రాత్మకం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపిండు. పోలీసు కమిషనరేట్, మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ కోర్టు ఏర్పాటు చేయించిండు. వందల కోట్లు తెచ్చి పట్టణాన్ని సుందరీకరించిండు. ప్రజలు చేసిన అభివృద్ధిని చూసి కారుకు ఓటేయాలి.
-కోరుకంటి మణిదీప్, రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ తనయుడు
చల్మెడ లక్ష్మీనర్సింహరావు కూతుళ్లు నివేదిక, నిహారిక ఇద్దరూ వైద్యులే. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరు నియోజకవర్గం అంతటా తిరుగుతున్నారు. ప్రతి ఊరికి వెళ్తూ.. గడపగడపనూ తడుతూ తమ తండ్రిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, సాగునీటికి నోచుకోని మెట్ట ప్రాంతం నాడు ఎట్లుండె.. నేడు ఎట్లయింది.. అంటూ ప్రజలకు వివరిస్తున్నారు. చందుర్తి, కథలాపూర్, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడ మండలాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
వేములవాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా డాడీ పోటీ చేస్తున్నారు. డాడీ కోసం నేను, అక్క నిహారిక కష్టపడుతున్నం. కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్నం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వాగతిస్తున్నరు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు చాలా బాగున్నాయని చెబుతున్నరు. ముఖ్యంగా రైతులు, కుల వృత్తుల వాళ్లు, గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నయి. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నరు. వస్తేనే ఇంకా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం వారిలో ఉన్నది. నియోజకవర్గంలో ఎక్కువ శాతం గిరిజన తండాలున్నయి. తండాలను పంచాయతీలుగా చేసినందుకు వారెంతో సంతోషంగా ఉన్నరు. ప్రజల్లో ఉన్న స్పందన చూస్తే వేములవాడలో మా డాడీ తప్పకుండా గెలుస్తడన్న విశ్వాసం మాకు ఉన్నది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం.
– చల్మెడ నివేదిత, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు కూతురు
పుట్ట మధూకర్ కొడుకు, పుట్ట లింగమ్మ ట్రస్టు ఫౌండర్ పుట్ట శ్రీహర్ష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు తండ్రి పాదయాత్రలో వెంట నడిచాడు. ఈ పాదయాత్ర నియోజకవర్గం పరిధిలోగల తొమ్మిది మండలాల్లోని 97 గ్రామాల్లో సాగగా అన్నీ తానై ముందుకు సాగాడు. తనదైన శైలిలో మాట్లాడుతూ గ్రామాల్లోని యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. పార్టీ శ్రేణులతో సమావేశమై గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నాడు.