కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికి చేసిందేమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ర్టానికి ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఊరూరుకు అభివృద్ధి, ఇంటింటికీ సంక్షేమం అన్నట్లుగా పాలన జరుగుతోందని, కేసీఆర్ ఆలోచనా విధానంతో రూపొందిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరువయ్యాయని, ప్రజలను ఓటు అడిగే హక్కు మనకే ఉందని అన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త అంకిత భావంతో పని చేయాలని కోరారు. గ్రామాల్లో పర్యటిస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారిని నేరుగా కలిసి వారికి జరుగుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, వంద సీట్లకుపైగా సాధిస్తామని, మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని అన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి కార్యకర్తను సన్నద్ధం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఇంటికి వెళ్లి మోటివెట్ చేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనాలతో అందరం ఒక్క వేదికపైకి రావాలని, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవరంలోని పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.