చొప్పదండి,(రామడుగు), నవంబర్ 23: నియోజకవర్గంలోని ప్రజలే తన బలం.. బలగం అని బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సుంకె రవిశంకర్ మాట్లాడారు. ప్రాణం ఉన్నంతవరకు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డను ఈ మట్టిలోనే కలిసిపోతానన్నారు. స్థానిక బిడ్డనైన తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే గోసపడతామన్నారు.
దేశంలో ఎక్కడా జరుగనంత అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని, ఇందుకు నిదర్శనం వెలిచాల అని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిచి అవార్డు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రైనీ ఐఏస్, ఐపీఎస్ అధికారులు శిక్షణలో భాగంగా సందర్శించే స్థాయికి గ్రామం ఎదగడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు రానున్న ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
వెలిచాల గ్రామానికి ప్రచారానికి వచ్చిన సుంకె రవిశంకర్కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత -లక్ష్మణ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు శుక్రొద్ద్దీన్, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మారొండ కిష్టారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు వీర్ల సంజీవరావు, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, ఉప సర్పంచ్ పుధారి వెంకటేశ్, మారెట్ డైరెక్టర్ మీసా లచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు చిమ్మళ్ల మహేశ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు ఆరెపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు