గంగాధర, డిసెంబర్ 22 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ మాటలు మానుకోవాలని, ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. బూరుగుపల్లిలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల సెస్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నాడని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చే ర్పించాలన్నారు. ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణలో రైతులు, చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు బండికి తెలియవా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తుంటే అసలు కరెంటే ఇవ్వడం లేదని బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమని, ఆయన తెలంగాణకు చెందిన వాడు కాదా, ఆంధ్ర, గుజరాత్కు చెందినా వాడా అని ప్రశ్నించారు. గుజరాత్ గులాం కాబట్టే అక్కడ జరగని అభివృద్ధి, 24 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితిని ఇక్కడ చెబుతున్నట్లు ఉన్నాడని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో అవార్డులు తెలంగాణ రాష్టానికే ఎందుకు వచ్చాయో తెలియని దద్దమ్మ ఎంపీ బండి సంజయ్ అని దుయ్యబట్టారు. జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు ఎప్పుడు వస్తాయో, కేంద్రం ఇస్తామన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలపై గాని, రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సెస్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు.