సారంగాపూర్, సెప్టెంబర్ 7 : సోషల్ మీడియాలో కొంత మంది మనం చేసిన పనులను వక్రీకరించి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉన్నది? రాష్ట్రం రాకముందు ఎలా ఉన్నదో..? ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ను మరోసారి ఆదరించాలని కోరా రు. గురువారం సారంగాపూర్, బీర్పూర్ రైతువేదికల ఆవరణల్లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సారంగాపూర్లో ఎనిమిది మందికి కల్యాణలక్ష్మి, 21 మం దికి సీఎంఆర్ఎఫ్ కింద 4.63లక్షల విలువైన చెక్కులు.. బీర్పూర్లో 15మందికి కల్యాణలక్ష్మి, ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ కింద 1.14లక్షల విలువైన చెక్కులు అందజేశారు. జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యే సంజయ్ బీర్పూర్ మండల కేంద్రానికి రాగా, బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు బీర్పూర్ గుట్ట కమాన్ నుంచి రైతువేదిక వరకు వందలాది బైక్లతో ర్యాలీ తీసి ఘన స్వాగతం పలికారు.
అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా యువతుల పెండ్లికి కల్యాణలక్ష్మి కింద లక్షా నూటపదహార్లు ఇస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లీబిడ్డలకు బలవర్ధకమైన పోషకాహారం అందిస్తున్నామని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలందిస్తూ, 102 వాహనం ద్వారా ఇంటి వద్దకు చేరుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మనలాంటి అభివృద్ధి, పథకాలు లేవన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ‘సంపదను పెంచు.. పేదలకు పంచు’అనే నినాదంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 24గంటల కరెంట్ ఉంటున్నదని, సాగునీటి సమస్య తీరిందని చెప్పారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఇప్పటి వరకు సీఎం సహాయనిధి కింద 6 నుంచి 8వేల మందికి దాదాపు 9కోట్లు వరకు తీసుకొచ్చానని తెలిపారు. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేసిన సందర్భంగా రైతువేదికల వద్ద ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, కేడీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, ఆర్బీఎస్ సభ్యుడు కొల్ముల రమణ, సారంగాపూర్, బీర్పూర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గుర్రాల రాజేందర్ రెడ్డి, నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శులు తోడేటి శేఖర్ గౌడ్, శీలం రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు జొగినిపెల్లి సుధాకర్ రావు, ఆలయ చైర్మన్ నేరెల్ల సుమన్ గౌడ్, తహసీల్దార్లు తఫాజుల్లా హుస్సేన్, విజయలలిత తదితరులు పాల్గొన్నారు.