జగిత్యాల రూరల్, జూలై 17: ‘నాడు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు చేసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలోఆనందంగా ఉన్న రైతును చూస్తే కండ్లు మండించుకుంటు న్నది. అన్నదాతలు సంబురంగా సాగు చేసుకుం టూ బాగుపడుతుంటే ఆ పార్టీ నాయకులకు నచ్చుతలేదు. రైతుబంధు, బీమా, ఉచిత కరెంట్ను రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతున్నరని’ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం జగిత్యాల రూరల్ మండలం చల్గల్లోని రైతు వేదికలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి రైతు సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై రైతులతో కలిసి నిరసన తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందనడం సరికాదని, వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు కావాలా..? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే నిరంతర విద్యుత్ కావాలా.. రైతులు ఆలోచన చేయాలని, గ్రామాల్లో ప్రతి హోటల్ వద్ద చర్చ జరపాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ రాకముందు రైతులు రాత్రింబవళ్లు ఇంటి వద్ద ఉన్న దాఖలాలున్నాయా..? చెప్పాలని రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. నాడు నియోజకవర్గంలో 23 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే నేడు 66 వేల ఎకరాల్లో సాగవుతున్నదని, ఇది నిరంతర విద్యుత్ ఘనతేనని చెప్పారు.
అనంతరం రైతువేదికలో రైతులకు భోజనాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఇక్కడ జగిత్యాల రూరల్ ఇన్చార్జి ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, మారెట్ కమిటీ చైర్మన్ నకల రాధ, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, జిల్లా సభ్యులు బాల ముకుందం, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ అసిఫ్, సర్పంచ్ బోనగిరి నారాయణ, ఎంపీటీసీ భూపెల్లి శ్రీను, నాయకులు దావ సురేష్, ఎల్ల రాజన్న, నాడెం శంకర్, బొల్లె గంగారాం, నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలి
మూడు పంటలకు నిరంతర విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటల కాంగ్రె స్సా..? మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీనా..? ఏదీ కావాలో రైతులే ఆలోచించుకోవాలి. నాడు కాంగ్రెస్ హయాంలో రైతులకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వకపోగా, ఏడు గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి కనీసం 3 గంటలు కూడా ఇవ్వలేదు. లో ఓల్టేజీతో నిత్యం మోటార్లు కాలిపోతుండేవి. ఆ కష్టాలను ఇంకా రైతులు మర్చిపోలేదు. రైతులు బాగుపడుతుంటే ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం లే దు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీని, 24 గంటల విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ను ప్రజలు, రైతులు తరిమికొట్టాలి. లేదంటే మోసపోవడం ఖాయం. కాంగ్రెస్ దళారుల కోసం, బీజేపీ అదానీ, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– దావ వసంత, జడ్పీ చైర్పర్సన్ (జగిత్యాల)