మానకొండూర్ రూరల్, జనవరి 28: ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక వరమని ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ తెలిపారు. శనివారం కొండపల్కలలో మంజూరైన కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. కల్యాణలక్ష్మి నిరుపేద ఆడబిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నదన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్తో భరోసా ఇస్తున్నదని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఆడబిడ్డలకు తన వంతుగా ఎమ్మెల్యే చీరను అందజేశారు. గ్రామంలో ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్, నలుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. చెక్కులను అందుకున్న బాధిత కుటుంబాలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే, సుడా చైర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల రైతు బంధు కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట రాజమౌళి, గ్రామ రైతు బంధు కన్వీనర్ కడారి ప్రభాకర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అడప శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బొంగొని రేణుక, గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు దాసరి రాజ్కుమార్, మాజీ ఎంపీటీసీ జనగాం శంకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
కొండపల్కల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కడారి రమేశ్ -లక్ష్మి కూతురు తేజశ్రీ-గోపికృష్ణ వివా హానికి ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, జీవీ రామకృష్ణారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణలోనే వీవోఏలకు గుర్తింపు
తిమ్మాపూర్ రూరల్, జనవరి28: తెలంగాణ రాష్ట్రం వచ్చాకే గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్న వీవోఏలకు గుర్తింపు లభించిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. తమకు కనీస వేతనం రూ.15వేలు, ఐడీకార్డు, ఇన్యూరెన్స్ ఇప్చించాలని కోరుతూ, వీవోఏల సంఘం సభ్యులు ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వీవోఏల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మంజూల, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.