వేములవాడ, అక్టోబర్ 6: బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గ్రామాల్లోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత వివరింపజేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం వేములవాడ నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులతో ఆయన ప్రత్యేక సమావేశమై పార్టీ ఆవశ్యకతపై చర్చించి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. గ్రామ మండల శాఖలవారీగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
పనిచేసే కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారన్నారు. ప్రభుత్వ పథకాలపై వివరించాలని, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని కూడా వివరించాలన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఈ ప్రాంత నిరుద్యోగులకు చేపట్టనున్న ఇథనాల్ ప్రాజెక్టుపై కూడా వివరించి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పార్టీల మండలాధ్యక్షులు పుల్కం రాజు, ఊరడి ప్రవీణ్, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, డేగవత్ తిరుపతి, దయ్యాల కమలాకర్, గంగప్రసాద్, సత్తిరెడ్డి తదితరులు ఉన్నారు.