మంథని, నవంబర్ 8: ‘ఈ మట్టిలో పుట్టిన బిడ్డను..ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు..అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రకటించారు. భూపాలపల్లి జడ్పీ, మంథని మున్సిపల్ చైర్పర్సన్లు జక్కుల శ్రీహర్షిణీ, పుట్ట శైలజ, బీఆర్ఎస్ సీనియర్ నేత మాదాడీ శ్రీనివాస్రెడ్డి, ప్రముఖ న్యాయవాది శశికాంత్కాచేతో కలిసి బుధవారం మంథనిలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. బీసీ బిడ్డనైన తనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ నుంచి మూడోసారి మంథని ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని గణనీయంగా అభివృద్ధి చేశానని చెప్పారు. తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. మళ్లీ దీవించి అసెంబ్లీకి పంపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ విద్యార్థులకు హైదరాబాద్లో ఉండి చదువుకునేందుకు రెండు హాస్టళ్లను సొంతంగా ఏర్పాటు చేస్తామన్నారు.
నిరుపేదలకు సాముహిక వివాహాలు, ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయడంతో ఇంటి నిర్మాణానికి సొంతంగా సాయం చేస్తానని భరోసానిచ్చారు. తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఇస్తానని నిన్నటి ఆశీర్వాద సభలో ప్రకటించడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ నిధులతో మహదేవపూర్ ఐటీడీఏ కేంద్రం, ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మాణం తదితర పనులు చేస్తానని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన తనను మంథని నుంచి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, ఎక్కటి ఆనంతరెడ్డి, శంకర్లాల్, ఆరెపల్లి కుమార్, యాకుబ్, వీకే. రవి, శ్రీపతి బానయ్య, నక్క నాగేంద్ర, కొట్టే రమేష్, సెగ్గెం రాజేశ్, పిల్లి శేఖర్ పాల్గొన్నారు.