మహాముత్తారం, నవంబర్18: ‘ఓట్ల ముందర వచ్చి ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మద్దు..తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించండి.’ అంటూ ఓటర్లకు మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. శనివారం మహాముత్తారం మండలంలో నిమ్మగూడెం, యాత్నారం, సింగంపల్లి, రెడ్డిపల్లి, సింగారం, స్తంభంపల్లి పీకే, రేగులగూడెం, జీలపల్లి, మాదారం, వజినేపల్లి, స్తంభంపల్లి పీపీ, ములుగుపల్లి , పోలారం, ఉట్లపల్లి గ్రామాల్లో మధూకర్ ముమ్మర ప్రచారం చేశారు.
గిరిజన గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కార్నర్ మీటింగ్ల్లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చిన పథకాలతో 413 పేజీల మ్యానిఫెస్టోను రూపొందించారని ఆక్షేపించారు. వారు గెలిచేది లేదు..అందులోని స్కీంలను అమలు చేసేది లేదు అంటూ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే అడ్డదిడ్డమైన హామీలు ఇస్తున్నారని విరుచుపడ్డారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి తనను దీవించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తిచేశారు. తనను గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని శపథం చేశారు.
కాగా, మినాజీ పేట నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరడంతో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మహాముత్తారం పార్టీ మండలాధ్యక్షుడు కల్వచర్ల రాజు, మాజీ జడ్పీటీసీ మందల రాజిరెడ్డి, కాటారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాధారపు స్వామి, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి, మండల రైతు బంధు అధ్యక్షులు మార్కరాముగౌడ్, కాటారం సబ్డివిజన్ అధికార ప్రతినిధి జగన్నాయక్, మండల అధికార ప్రతినిధి బాలాజీ, మండల యూత్ అధ్యక్షులు జాటోత్ జైపాల్నాయక్, మండల ప్రచార కమిటి కన్వీనర్ పక్కల రాజబాపు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మంథని బీఆర్ఎస్ పార్టీ యంఎల్ఎ అభ్యార్ధి పుట్ట మధూకర్కు ఎన్నికల ఖర్చుకొరకు తమ వంతు సాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. యామన్పల్లి గ్రామానికి చెందిన పిలుమరి లక్ష్మి-మల్లయ్య దంపతులు శనివారం మధుకు రూ. 10116 సాయాన్ని అందజేశారు.