MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు.
ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో పుర్తిగా ధ్వసమైన రాచపల్లి నుండి బూజునూర్ గ్రామం వెళ్లే రోడ్డు, నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్డు, రాచపల్లి బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కుంగిపోయిందని వివరించారు. వీటికి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఇతర ప్రధాన రహదారులు, కాల్వల ప్రాజెక్ట్ నిర్మాణం, శాశ్వత మౌలిక వసతులు, హుజురాబాద్ స్కూల్ గ్రౌండ్ వంటి పలు కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వీటి గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వివరంగా చెప్పినట్లు గుర్తుచేశారు. హుజురాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసి, అనుమతులు పొందిన పనులు సహా పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్వీకరించి, వెంటనే రాచపల్లి నుండి బూజునూర్ గ్రామం వెళ్లే రోడ్డు, నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్డు, రాచపల్లి బ్రిడ్జ్ కి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హుజురాబాద్ అభివృద్ధికి అవసరమైన నిధులు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.