హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 26: రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు పొలాలకు నీరందించాలని కోరడంతో సంబంధిత మంత్రి తనతో నీళ్లందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు అందకపోవడం చాలా బాధాకరమన్నారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
ఎకరం ఎండిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లందించకపోవడం బాధాకరమని, సంబంధిత మంత్రులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటారని, తమను రాజకీయంగా ఎదురోవాలి కానీ, రైతులను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు నీళ్ల ఇబ్బంది ఉండేది కాదని గుర్తు చేశారు. పొలాలకు నీరందించకపోవడం చూస్తే స్థానిక మంత్రులు, అధికార పార్టీ నాయకుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. నీరందించకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలా తిరుగుతారో చూస్తామని, హుజూరాబాద్ ప్రజలంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని డిమాండ్ చేశారు.