కొడిమ్యాల, ఏప్రిల్ 17 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ కోటలకు బీటలు వారడం మొదలైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరుతుండగా, అంతటా కల్లోలం రేగుతున్నది. అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పోయిన హస్తం పార్టీకి రాంరాం చెప్పేందుకు వందలాది మంది నాయకులు సిద్ధమవుతుండగా, కేడర్ను కాపాడుకునేందుకు అధిష్టానం రగంలోకి దిగింది. అందులో భాగంగా నామినేటెడ్ పోస్టులను ఎరగా వేస్తున్నట్టు తెలుస్తుండగా, అయినా ఆ పార్టీలో తాముండలేమని పలువురు నేతలు ఇప్పటికే తెగిసి చెప్పడం అలజడి రేపుతున్నది.
తాజాగా ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి వ్యతిరేకంగా కొడిమ్యాల మండలం నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడడం కలకలం రేపుతున్నది. శుక్రవారం కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్రెడ్డితోపాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పంపిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. తాను 2006 నుంచి 2011 వరకు కొడిమ్యాల ఎంపీటీసీగా, 2013 నుంచి సర్పంచ్గా పనిచేశానని గుర్తు చేశారు. 2014లో కాంగ్రెస్లో చేరానని, అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. 2023లో మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలువడానికి గ్రామగ్రామానా తిరిగామని చెప్పారు. గెలిచిన తర్వాత ఆయనలో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని, అవి అమలు చేయాలని అడిగితే సొంత పార్టీ నాయకులనే శత్రువులాగా చూస్తున్నారని విమర్శించారు.
వివిధ అంశాల్లో వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పూడూర్లో కోట్లు విలువ చేసే ఖాదీ బోర్డు భూములను పద్మశాలీలకు ఇప్పిస్తానని ఎన్నికల ముందు చెప్పి.. గెలిచిన తర్వాత భూములు అన్యాక్రాంతానికి కారణమైన వ్యక్తినే తన పక్కన చేర్చుకున్నాడని మండిపడ్డారు. దొంగతనంగా సీఎంఆర్ఎఫ్ చెక్కు డ్రా చేసినట్టు ఆరోపణలున్న గడ్డం జీవన్రెడ్డికి సపోర్టు చేసి కొడిమ్యాల సర్పంచ్గా గెలిపించారని విమర్శించారు. కోనాపూర్కు చెందిన ఓ వ్యక్తి తన భూమిని అమ్ముకోవడానికి బుక్ చేసుకున్న స్లాట్ను కొడిమ్యాల సర్పంచ్ క్యాన్సల్ చేయించి రూ.రెండు లక్షలు డిమాండ్ చేశాడని, ఆయనపై ప్రజావాణిలో ఆధారాలతోసహా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఇటీవల మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేని ఓ వ్యక్తిని డబ్బులు తీసుకొని నియమించారని ఆరోపించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్ననే విషయం తెలుసుకొని కొద్ది రోజులుగా తన అనుచరులతో నామినేటేడ్ పదవులు ఇప్పిస్తా అని రాయబారానికి పంపుతున్నారని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ పెట్టేకంటే గంట ముందు నాతో వస్తున్న కార్యకర్తలకు ఫొన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.