గోదావరిఖని, అక్టోబర్ 10: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలనీ, ఈ నెలరోజులు కార్యకర్తలందరూ కష్టపడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో రామగుండం ప్రజలు ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్దేశించార. సీఎం కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు.
పదేళ్లలో వందేళ్ల ప్రగతి సాధించిన బీఆర్ఎస్ను గెలిపించుకోవడం మనందరి ధర్మమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇన్నాళ్లు పని చేసిందంతా ఒకెత్తయితే ఈ నెలరోజులు పని చేసేది ఒకెత్తన్నారు. నాడు ఉమ్మ డి పాలకులు తెలంగాణను ఆగం పట్టించారనీ, సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిల్లో మళ్లీ కాంగ్రెస్, బీజేపీ చేతిలో తెలంగాణను పెడితే భవిష్యత్ మళ్లీ అంధకారమే అన్నది ప్రజలకు విడమరిచి చెప్పాలని కోరారు. సమావేశంలో నాయకులు కౌశిక హరి, మాదాసు రాంమ్మూర్తి, పీటీ స్వామి, మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్ పాల్గొన్నారు.