కార్పొరేషన్, ఫిబ్రవరి 11: నల్లగొండలో ఈనెల 13న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి శ్రేణులు తరలివెళ్లాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని తన నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సభను నిర్వహిస్తున్నామని చెప్పా రు. నియోజకవర్గం నుంచి రెండు వేల మందిని తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఎంపీపీ లక్ష్మయ్య, నాయకులు శ్యాం సుందర్రెడ్డి, పొన్నం అనిల్, జమీలోద్దీన్, సాబీర్పాషా, బండారి వేణు, అయిలేందర్ పాల్గొన్నారు.