కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్ ఏప్రిల్ 27: ‘తెలంగాణ గడ్డపై భూమి, నీరు ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణ చరిత్రను చెరిపివేయలేరు’ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమనేత కేసీఆర్ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ సాధన కోసం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. అంతేగానీ పదవుల కోసమో, అధికారాన్ని అనుభవించేందుకు కాదన్నారు.
కేసీఆర్ సారథ్యంలో 14 ఏండ్లు నిజాయితీగా పోరాటం చేశామన్నారు. ఆయన కరీంనగర్ వేదికగా ‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో వెలుగులు నింపామని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నాలుగు నెలల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేని లోటు కనిపిస్తుందన్నారు.
పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా పదేళ్లలో అనేక సంక్షేమ ఫలాల్ని అందించిన పార్టీగా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కుర్ర తిరుపతి, గంట కళ్యాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, కరీంనగర్ రూరల్ పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, నాయకులు కంసాల శ్రీనివాస్, పెండ్యాల మహేశ్, ఉదారపు మారుతి, తిరుపతి, రాజు, ఆరె రవి, జువ్వాడి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.