ఓ మైనార్టీ వితంతువుపై లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన సర్పంచ్కు మద్దతుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగడం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టింది. మైనార్టీల రక్షణకు కట్టుబడి ఉన్న రాష్ట్ర సర్కారు ఈ వర్గానికి చెందిన ఓ మహిళ వేధింపులకు గురికావడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో సదరు బీజేపీ సర్పంచ్ను, ఆయనకు వత్తాసుపలికిన మరో వార్డు సభ్యుడిని అరెస్ట్ట్ చేసి జైలుకు పంపింది. ఇది అన్యాయమని, అక్రమమని ఈటల ఏకంగా ధర్నాకు దిగడం హుజూరాబాద్ ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్సపొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు, పోలీసులు చెబుతున్నా.. ఇందుకు కారకులను జైల్లో కలిసి పరామర్శించడం ఎమ్మెల్యే రాజేందర్కే చెల్లింది. మానవత్వం కంటే తనకు రాజకీయాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.
– హుజూరాబాద్/ హుజూరాబాద్రూరల్, ఏప్రిల్16
హుజూరాబాద్ / హుజూరాబాద్రూరల్, ఏప్రిల్ 16 : హుజూరాబాద్ మండలం చెల్పూర్ ఘటన విషయంలో నిందితులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలుపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వితంతువును వేధించిన వారికి వత్తాసు పలుకుతూ ధర్నాలో పాల్గొనడం మహిళల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నది.
చెల్పూర్లో ఏం జరిగింది?
హుజూరాబాద్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ చెల్పూర్లో మసీద్ సమీపంలో ఓ మైనార్టీ వితంతువు పదమూడేండ్లుగా చికెన్, మటన్ షాపు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నది. మూడేండ్లుగా సర్పంచ్ నేరెళ్ల మహేందర్గౌడ్ తనను వేధిస్తున్నాడని సదరు మహిళ బహిరంగానే చెప్పుకున్నది. ఈ క్రమంలో ఆమె మనస్తాపం చెంది ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం జమ్మికుంటలోని ఓ దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె కొడుకు ఈ ఘటనపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ మహేందర్గౌడ్ ఈ నెల 11న రాత్రి తన తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు అజ్జు అలియాస్ ఇబ్రహీంతో కలిసి తమ ఇంటికి వెళ్లాడని, అజ్జు ఇంటి బయట ఉండగా మహేందర్గౌడ్ ఇంట్లోకి వెళ్లి తన తల్లిని లైంగికంగా వేధించాడని, దీంతో తప్పించుకొని ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి గడియ వేసుకుని తనను తాను రక్షించుకున్నదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా, చెప్పినట్టు వినకపోతే చికెన్ సెంటర్ తొలగించి, గ్రామం నుంచి వెళ్లగొడుతానని సర్పంచ్ బెదిరింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, 11వ తేదీన జరిగిన విషయాన్ని బాధిత మహిళ మరుసటి రోజు గ్రామంలో పలువురితో చెప్పుకున్నది. పంచాయతీ సిబ్బంది తన చికెన్ సెంటర్ డబ్బాను తొలగిస్తున్నారని వాపోతూ సర్పంచ్ తమ్ముడికి చెందిన దుకాణంలోనే పురుగుల మందు డబ్బా కొనుక్కొని నేరుగా సర్పంచ్ దగ్గరికి వెళ్లింది. ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించక పోవడంతో కాళ్లపై పడి బతిమిలాడుకున్నది. అయినా, ఆయన కనికరించ లేదు. దీంతో అందరి ముందే బాధితురాలు పురుగుల మందు తాగింది. ఈ ఘటనపై హుజూరాబాద్ టౌన్ సీఐ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి మైనార్టీ మహిళ ఆత్మహత్యాయత్నానికి కారణమైన సర్పంచ్ మహేందర్గౌడ్, వార్డు సభ్యుడు అజ్జు అలియాస్ ఇబ్రహీంపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హుజూరాబాద్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నారు.
ఈటల తీరుపై విమర్శల వెల్లువ
చెల్పూరు ఘటనలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగిందో, పోలీసులు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండానే హుజూరాబాద్ సబ్ జైల్లో ఉన్న నిందితులను ఈటల రాజేందర్ పరామర్శించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అంతే కాకుండా, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఇదే విషయమై జరిగిన ధర్నాలో పాల్గొనడం నియోజకవర్గ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ మైనార్టీ మహిళ అన్యాయానికి గురైతే సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఇందుకు విరుద్ధంగా తప్పు చేసిన వారికి మద్దుతుగా నిలిచి ధర్నాకు దిగడం ఏమిటనే ఆరోపణలు వస్తున్నాయి. తమ పని తాము చేసుకుంటూ పోతున్న పోలీసులను నిందిస్తూ, దూషిస్తూ చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తప్పు చేసిన వాళ్లు చట్ట ప్రకారంగా శిక్షార్హులనే విషయాన్ని మర్చిపోయిన ఈటల తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల ఎమ్మెల్యేగా తప్పు చేసిన వారిని శిక్షించాలని పోలీసులకు చెప్పాల్సిన రాజేందర్ ఏకంగా చట్ట పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులను పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనపై సర్పంచ్ మహేందర్గౌడ్ కీచకుడని ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రోల్ కావడం ఆసక్తిగా మారింది.