కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు వరించాయి. అందరూ అనుకున్నట్టుగానే మంథని నుంచి గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, అలాగే హుస్నాబాద్ నుంచి విజయం సాధించిన పొన్నం ప్రభాకర్కు దక్కాయి. గురువారం ముఖ్యమంత్రితోపాటు వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆది నుంచీ కాంగ్రెస్కు అండగా ఉన్న వీరు, ఓటమి, గెలుపులను సమాంతరంగా భావిస్తూ అదే పార్టీలో కొనసాగారు.
శ్రీధర్బాబు మంథని గడ్డపై ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించడమే కాదు, గతంలోనే మంత్రి బాధ్యతలతోపాటు మరెన్నో పదవులు స్వీకరించి మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే విద్యార్ధి దశ నుంచి అంచలంచెలుగా ఎదిగిన పొన్నం, ఎన్ఎస్యూఐ నుంచి ఎంపీగా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్గా పని చేయడంతోపాటు వివిధ పదవులు చేపట్టారు.
నాడు తెలంగాణ ఏర్పాటు కోసం సొంత పార్టీలోనే ఎదురుతిరిగిన వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలోఅనుభవం, పార్టీకి అందించిన సేవలు.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు కల్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాకు రెండు అమాత్య పదవులు రావడంతో హస్తం శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావు మంథని గడ్డపై నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలువగా, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు విజయం సాధించారు. ఒక్క శ్రీధర్బాబు మాత్రమే ఐదు సార్లు ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. అపార అనుభవమున్న శ్రీపాదరావు వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన, ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తూ వస్తున్నారు. 1999లో మొదటిసారి మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
2014లో ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి పుంజుకున్న శ్రీధర్బాబు వరుసగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. మంథని గడ్డపైనుంచి ఐదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్మెట్రాలజీ మంత్రిగా.. శానసభ సభా వ్యవహారాలు, ఉన్నత విద్య, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
మంత్రితోపాటు ఆయన ఆది నుంచీ కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కార్యదర్శిగా, 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, 2004-2006 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా, 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వ విప్గా, 2014 నుంచి 2016 వరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్గా, 2006 నుంచి 2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, 2022 నుంచి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కొనసాగారు.
తాజా ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పనిచేశారు. వీటితోపాటు ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో శ్రీధర్బాబు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అనుభవం, పార్టీపై ఉన్న అంకితభావం, పనితీరు వంటివి పరిగణలోకి తీసుకొని మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు తెలుస్తుండగా, గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీనియర్లకు చోటు దక్కింది. మంథని అసెంబ్లీ గడ్డపై నుంచి ఐదు సార్లు గెలిచి రికార్డు సృష్టించిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, గతంలో ఎంపీగా పనిచేసి ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు ఇచ్చారు.
గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన శ్రీధర్బాబు రెండోసారి బాధ్యతలు చేపట్టగా, ప్రభాకర్ మొదటిసారి అమాత్య పదవి చేపట్టారు. ఈ ఇద్దరి ప్రమాణ స్వీకారం కోసం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలి వెళ్లారు. అలాగే జిల్లాలోనూ సంబురాలు చేసుకున్నారు.
ఒక సామాన్య కుటుంబలో జన్మించిన పొన్నం ప్రభాకర్ ఎటువంటి వారసత్వం లేకుండా స్వశక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే వెనుక బలమైన శక్తి ఉండాలి. లేదా పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం ఉండాలి. ఇవేవీ లేకుండానే పొన్నం విద్యార్థి నాయకుడి దశ నుంచి మంత్రి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని సాగి స్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో ఆయన సొంత పార్టీ నుంచే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 1987-88లో శ్రీ రాజరాజేశ్వర డిగ్రీకళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తన ప్రస్థా నం ప్రారంభించారు.
1987-89లో జిల్లా ఎన్ఎస్యూఐ విద్యార్థి ప్రధాన కార్యదర్శిగా, 1989-91లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా, 1992-98లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2002-03లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2002-04లో పీసీసీ మీడియా-కో ఆర్డినేటర్గా, 2005-2009 వరకు ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆనా టి ఉమ్మడి రాష్ట్ర లోకసభ, రాజ్యసభ ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా, రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, రసాయనాలు మరియు ఎరువుల కమిటీ స్టాడింగ్ సభ్యుడిగా పనిచేశారు.
పదవులతోపాటు ఆయన తెలంగాణ ఉద్యమంలో చురకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆది నుంచీ పోరాటం చేసినా ఆయన పలు సందర్భాల్లో అధిష్టానంతో పోరుకు ది గారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. అధికార పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిలో ముందున్న వ్యక్తిగా పొన్నం నిలిచారు. కాగా 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
అదే పార్టీలో కొనసాగుతూ తనవంతు సేవలందిస్తూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన ఆయన, హుస్నాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. విద్యార్ధి దశ నుంచి రాజకీయ నేపథ్యం ఉండడం, వివిధ హోదాలో పార్టీకి సేవలందించడం, ఎంపీగా ఆయనకున్న అనుభవం వంటివి పరిగణలోకి తీసుకొని మంత్రివర్గంలో చోటు కల్పించగా, తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు.