జగిత్యాల కలెక్టరేట్/ సారంగాపూర్, డిసెంబర్ 8 : ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తక్షణమే వాటిని అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి గెలిచిన నేపథ్యంలో జగిత్యాల పట్టణ, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. వరుసగా రెండోసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరి ధాన్యంతో పాటు అన్ని పంటలకూ ప్రతి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.